Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో సింధు, సైనా, శ్రీకాంత్
- నేటి నుంచి జపాన్ ఓపెన్
టోక్యో : క్వార్టర్ఫైనల్లో నొజొమి ఒకుహరను, సెమీఫైనల్లో చెన్ యుఫెను ఓడించి టైటిల్ లాంఛనమే అనుకున్న సింధుకు గత వారం జకర్తాలో ఝలక్ ఎదురైంది. జపాన్ భామ అకానె యమగూచి ఇండోనేషియా టైటిల్ ఎగరేసుకుపోయింది. జకర్తాలో చేజారిన టైటిల్ను, టోక్యోలో సొంతం చేసుకునేందుకు తెలుగు తేజం, ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు సిద్ధమవుతోంది. జపాన్ ఓపెన్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఐదో సీడ్ సింధు తొలి రౌండ్లో చైనా షట్లర్తో తలపడనుంది. సింధు క్వార్టర్స్కు చేరుకుంటే, అక్కడ ఆమె జకర్తా ఫైనల్ ప్రత్యర్థి అకానె యమగూచితో తలపడాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సమస్యలతో ఇండోనేషియాకు దూరమైన సైనా నెహ్వాల్ జపాన్లో బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్లో థారులాండ్ షట్లర్ బుసానన్తో సైనా ఢీ కొటుంది. ఈ సీజన్లో టైటిల్ నెగ్గిన ఏకైక షట్లర్ సైనా నెహ్వాల్. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న సైనా ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సహచర షట్లర్ హెచ్.ఎస్ ప్రణరుతో కిదాంబి శ్రీకాంత్ తలపడనున్నాడు. బి సాయిప్రణీత్, సమీర్ వర్మలు సైతం రేసులో ఉన్నారు. మెన్స్ డబుల్స్లో చిరాగ్ శెట్టి, సాత్విక్రెడ్డి జోడీ.. మను అత్రి, సుమీర్ రెడ్డి జంట రేసులో ఉన్నాయి. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట పోటీలో నిలిచింది. మిక్స్డ్ డబుల్స్లో చిరాగ్తో కలిసి సిక్కి రెడ్డి.. సాత్విక్తో కలిసి అశ్విని బరిలోకి దిగుతున్నారు.