Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 42-23తో యు ముంబాపై విజయం
- బోణీ కొట్టిన హర్యానా స్టీలర్స్
- ప్రొ కబడ్డీ లీగ్ 7
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రొ కబడ్డీ లీగ్ తొలి విజేత్ జైపూర్ పింక్ పాంథర్స్ సీజన్ 7లో అదిరే బోణీ కొట్టింది. మాజీ చాంపియన్ యు ముంబాపై 42-23తో భారీ తేడాతో గెలుపొందింది. సీనియర్, జూనియర్ కాంబినేషన్లో మెరుగ్గా కనిపించిన జైపూర్ 19 పాయింట్ల తేడాతో ముంబయిని చిత్తు చేసింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్పై గెలుపొంది జోరందుకున్న యు ముంబా.. తన రెండో మ్యాచ్లోనే చతికిల పడింది. మరో మ్యాచ్లో పుణెరి పల్టన్పై హర్యానా స్టీలర్స్ 34-24తో అలవోక విజయం సాధించింది. తొలి రైడ్లోనే రెండు పాయింట్లు సాధించిన రైడర్ దీపన్ నివాశ్ హుడా జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 15 సార్లు కూతకెళ్లి దీపక్ పది సార్లు పాయింట్లు తీసుకొచ్చాడు. ఒక్క సారి కూడా ముంబయి డిఫెండర్లు దీపక్ను అడ్డుకోలేదు. 11 పాయింట్లతో మెరిసిన దీపక్కు నితిన్ ఏడు రైడ్ పాయింట్లు, దీపక్ నర్వాల్ 6 రైడ్ పాయింట్లతో సహకరించారు. డిఫెండర్లు అమిత్ హుడా ఐదు ట్యాకిల్స్ చేయగా, విశాల్ మూడు ట్యాకిల్స్తో మెరిశాడు. రైడింగ్లో 25-18తో, ట్యాక్లింగ్లో 11-5తో జైపూర్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. మూడు సార్లు ముంబయిని ఆలౌట్ చేసి ఆరు పాయింట్లు సొంతం చేసుకుంది. యు ముంబా తరఫున రైడర్ అభిషేక్ సింగ్ ఏడు పాయింట్లు సాధించాడు. డిఫెండర్ సురేందర్ మూడు ట్యాకిల్స్ చేశాడు. తెలుగు టైటాన్స్పై మెరిసిన డిఫెండింగ్ ద్వయం ఫజెల్ అత్రచలి, సందీప్ నర్వాల్ నిరాశపరిచారు. హర్యానా స్టీలర్స్ 34-24తో పది పాయింట్ల తేడాతో పుణెరి పల్టన్ను పల్టీ కొట్టించింది. కోచ్గా అనూప్ కుమార్ తొలి మ్యాచ్లోనే ఓటమి చవిచూశాడు. హర్యానా రైడర్ నవీన్ 12 పాయింట్లు సాధించగా, డిఫెండర్ వికాశ్ కాళే నాలుగు ట్యాకిల్స్ చేశాడు. పుణె రైడర్ పవన్ కడియన్ 10 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. ప్రొ కబడ్డీ సీజన్ 7లో నేడు (మంగళవారం) విరామ రోజు. బుధవారం తెలుగు టైటాన్స్తో దబంగ్ ఢిల్లీ, యూపీ యోధతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.