Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల హాకీ జట్టు కఠిన డైట్
- టోక్యో క్వాలిఫయర్స్కు సన్నద్ధత
బెంగళూర్ : భారత క్రీడా రంగంలోకి ఇప్పుడు ఫిట్నెస్, సైంటిఫిక్ డైట్ చేరిపోయాయి. భారత క్రికెట్ జట్టు ఇప్పటికే డైట్లో విప్లవాత్మక మార్పులు చవిచూడగా.. ఫిట్నెస్లో అత్యున్నత యోయో టెస్టును ప్రామాణికం చేసింది. మెన్స్ హాకీ జట్టుతో పాటు కండల తిరిగిన యోధులు రెజ్లర్లు సైతం ఆహార నియమాల్లో కచ్చితత్వం పాటిస్తున్నారు. 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన మహిళల హాకీ జట్టు.. ఇప్పుడు టోక్యోలో అవకాశం దక్కితే మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దిశగా భారత మహిళల హాకీ జట్టుకు ఒకే అవకాశం మిగిలి ఉంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో మెరిస్తే, అమ్మాయిలు వరుసగా రెండో సారి ఒలింపిక్స్లో పోటీపడవచ్చు. ఇటీవల హిరోషిమాలో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ సిరీస్ ఫైనల్లో కండ్లుచెదిరే విజయం సాధించిన అమ్మాయిలు... ఒలింపిక్ క్వాలిఫయర్ కోసం కఠినంగా సాధన చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది డైట్. సైంటిఫిక్ సలహాదారు వేని లాంబార్డ్ రాకతో మహిళల జట్టు ఫిట్నెస్ పూర్తిగా మారిపోయిందిన కెప్టెన్ రాణి రాంపాల్ కొనియాడారు.
' నేను చూసిన భారత మహిళల హాకీ జట్లలో ఇదే ఫిట్నెస్ సాధించిన జట్టుగా చెప్పగలను. జట్టుతో పాటు ప్రతి క్రీడాకారిణి పట్ల వేని లాంబార్డ్ ఎంతో శ్రద్ద వహిస్తున్నారు. అందరం లాంబార్డ్ డైట్ ప్రణాళికలను పాటిస్తున్నాం, ఫలితాలు చవిచూస్తున్నాం. మైదానంలో మెరుగైన ప్రదర్శన చేయాలంటే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని లాంబార్డ్ చెబుతాడు' అని రాణి రాంపాల్ తెలిపింది. స్వీట్లు తినటం ఆపేశాము, చాకోలేట్లు లేవు. కారం, నూనె పదార్ధాల ఊసే లేదు. తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటున్నాం. మంచి అనుభూతి పొందుతున్నామని రాణి పేర్కొన్నది. ఒలింపిక్స్లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన 1980లో చేసింది. ఆ ఏడాదిలోనే మహిళల హాకీని ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. మళ్లీ 2016 వరకూ మహిళల జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించలేదు. ' తొలుత మేం ఒలింపిక్స్కు అర్హత సాధించాలి, చేరుతామనే నమ్మకం ఉంది. పతకం సాధించగల సత్తా మాకుంది. ప్రపంచ హాకీలో నెదర్లాండ్స్ మినహా అన్ని జట్లు ఇతర జట్లను ర్యాంక్తో సంబంధం లేకుండా తమదైన రోజున ఓడించగలవు. భారత్ మెడల్ అవకాశాలపై ఆశావహ దృక్పథంతో ఉన్నాను' అని రాణి తెలిపింది.
ఇటీవల మహిళా అథ్లెట్లు హిమ దాస్, ద్యుతీ చంద్ ప్రదర్శన నుంచి మహిళల హాకీ జట్టు స్ఫూర్తి పొందుతుందని రాణి వ్యాఖ్యానించింది. ' హిమ దాస్ వరుసగా ఐదు స్వర్ణాలు సాధించింది. వరల్డ్ యూనివర్శిటీ మీట్లో ద్యుతీ చంద్ మెరిసింది. వారి నుంచి ప్రేరణ పొందుతాం. అమ్మాయిల విజయాలతో భారత్ విజయపతాక పైకెగురుతుంది. హాకీ ఇండియా మాత్రం వెనకాల ఎందుకుంటుంది? అని రాణి విశ్వాసం వ్యక్తం చేసింది. బెంగళూర్లో శిక్షణ శిబిరం అద్భుతంగా సాగింది. డిఫెన్స్పై ఎక్కువగా దృష్టి సారించాం. ఎటాకింగ్, పెనాల్టీ కార్నర్ సహా జట్టు బంధంపై పని చేశాం. మైదానం లోపల, వెలుపల వేగంగా నిర్ణయాలు తీసుకోవటం తెలుసుకున్నా మని రాణి పేర్కొన్నది. ఆగస్టులో జరిగే నాలుగు దేశాల టోర్నీలో హాకీ ఇండియా పాల్గొంటుంది. ఆస్ట్రేలియా, చైనా, జపాన్లతో రాణిసేన ఢీ కొంటుంది. ఇది కాకుండా, ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ ఆడనుంది.