Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీబీ చీఫ్ను నియమించిన ఐసీసీ
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక, శక్తివంతమైన ఆర్థిక కమిటీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ ఈషన్ మణి సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఐసీసీ ఈషన్ మణిని నియమించింది. ఐసీసీలో కీలక ఈ పోస్ట్ను గత పదేండ్లుగా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పంచుకుంటున్నాయి. బిగ్-3 గ్రూప్ను కాదని తొలిసారి పాకిస్థాన్కు ఈ పదవి దక్కింది. ఐసీసీ చైర్మెన్ శశాంక్ మనోహర్ స్వయంగా మణి పేరును లండన్ సమావేశాల్లో ప్రతిపాదించినట్టు తెలిసింది. స్వతంత్ర డైరెక్టర్ ఇంద్ర నూయి, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఎస్ఏ అధ్యక్షుడు క్రిస్ నెంజాని, ఐసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖవాజా, సీఏ చైర్మెన్్ ఎర్ల్ ఎడింగ్స్, ఈసీబీ చైర్మెన్ కొలిన్ గ్రేవ్స్ ఐసీసీ ఫైనాన్స్ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఐసీసీచైర్మెన్ శశాంక్ మనోహర్, సీఈవో మనులు ఎక్స్ అఫిసియో సభ్యులుగా సమావేశాలకు హాజరవుతారు. ఈ పదవి అందుకోవటం మణికి రెండోసారి. 1996-2002లో మణి తొలుత ఆర్థిక కమిటీ బాధ్యులుగా ఉన్నారు. తర్వాత ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023 తర్వాత జరగాల్సిన ఐసీసీ ఈవెంట్ల వేదికల ఖరారు, ప్రసారహక్కుల వేలం వంటి కీలక నిర్ణయాలను మణి ఆధ్వర్యంలో జరుగనున్నాయి. రానున్న ఐసీసీ ఈవెంట్ల బడ్జెట్ సహా సభ్య దేశాలకు ఆదాయ పంపిణీపైనా ఆ కమిటీ నిర్ణయాలు తీసుకోంది.
ఆ రూల్ మార్చండి : 2019 ప్రపంచకప్ విజేతను బౌండరీల తేడాతో నిర్ణయించటంపై అన్ని వైపుల నుంచి ఐసీసీ విమర్శలు చవిచూసింది. దీంతో బౌండరీల నిబంధనను తీసివేసి, మెరుగైన రూల్ తీసుకురావాలని ఐసీసీ క్రికెట్ కమిటీకి సూచించింది. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఈ నిబంధనను పరిశీలించి, మెరుగైన పద్దతిని సూచించనుంది