Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైజూస్ బీసీసీఐ కొత్త స్పాన్సర్
- ప్రకటించిన భారత క్రికెట్ బోర్డు
ముంబయి : ఈ సెప్టెంబర్లో భారత క్రికెట్ జట్టు ధరించే జెర్సీపై అధికారిక స్పాన్సర్ పేరు మారనుంది. చైనా మొబైల్ కంపెనీ ఒప్పో ఐదేండ్ల కాలానికి బీసీసీఐ జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది. 2017 మార్చిలో రూ.1079 కోట్లు వెచ్చించి ఖరీదైన బీసీసీఐ జెర్సీ స్పాన్సర్షిప్ను సొంతం చేసుకుంది. ఐదేండ్ల కాలం ముగియకుండానే ఒప్పో ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది. బెంగళూర్కు చెందిన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఆన్లైన్ ట్యూటరింగ్ సంస్థ బైజూస్.. ఇక నుంచి ఒప్పో స్థానంలో భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఐదేండ్ల ఒప్పదం నుంచి ఒప్పో నిష్క్రమణ బీసీసీఐకి ఎటువంటి నష్టం తీసుకురాదు. 2017లో ఒప్పో అంగీకరించిన ధరకు బైజూస్ చెల్లించనుంది. దీంతో బోర్డుకు చెందాల్సిన సొమ్ము పూర్తిగా అందనుంది. నష్టాలను పూడ్చుకునే పనిలో నిమగమైన ఒప్పో, ఈ క్రమంలో ఖరీదైన వ్యవహారంగా మారిని బీసీసీఐ జట్టు జెర్సీ స్పాన్సర్షిప్ను వదులుకునేందుకు సిద్ధమైంది. ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక మ్యాచ్కు రూ. 4.6 కోట్లు, ఐసీసీ/ఆసియా కప్ మ్యాచ్కు రూ. 1.56 కోట్లు చెల్లించాలి. బీసీసీఐ జెర్సీ స్పాన్సర్షిప్ హక్కులు ఒప్పో 2022 మార్చి వరకూ కలిగి ఉంది. ' బీసీసీఐ జెర్సీ స్పాన్సర్షిప్ ధర అధికం, భరించలేనిదని ఒప్పో భావిస్తోంది. ఇదే సమయంలో బైజూస్ బ్రాండింగ్ ప్రయోషన్పై దృష్టి పెట్టింది. భారత జట్టు జెర్సీ స్పాన్సర్షిప్ సరైన సాధనమని అనుకుంటోంది. సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో భారత్ స్వదేశీ సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్కు కోహ్లిసేన జెర్సీలపై బైజూస్ లోగో ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. గతంలో స్టార్ ఇండియా ద్వైపాక్షిక మ్యాచ్కు రూ. 1.92 కోట్లు, ఐసీసీ, ఆసియా కప్ మ్యాచ్కు రూ. 66 లక్షలు చెల్లించింది. ఒప్పో రికార్డు ధరతో డీల్ దక్కించుకుని, మధ్యలోనే తప్పుకుంటోంది. ' భారత క్రికెట్ జట్టు స్పాన్సర్గా మేం గర్వపడుతున్నాం. క్రికెట్ భారతీయుల గుండెచప్పుడు, కోట్లాది అభిమానులు ప్రేమించే జట్టులో భాగమైనందుకు సంతోషిస్తున్నాం. చిన్నారుల పురోగతికి క్రీడలది క్రియాశీల పాత్ర అని లెర్నింగ్ కంపెనీగా బైజూస్ ఎల్లప్పుడూ భావిస్తుంది. ఓ క్రికెటర్ కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తున్నట్టే, బైజూస్ ప్రతి ఒక్క చిన్నారి హృదయాన్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాం' అని బైజూస్ వ్యవస్థాపక సీఈవో బైజూ రవీంద్రన్ పేర్కొన్నాడు. 2019, సెప్టెంబర్ 5 నుంచి 2022 మార్చి 31 వరకూ బైజూస్ భారత క్రికెట్ జట్టు స్పాన్సర్గా ఉంటుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.