Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలింగ్ విధుల్లో ధోని
- భారత ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడి
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో రెండు మాసాల సెలవు తీసుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కాశ్మీర్ లోయలో 15 రోజుల పాటు సైనిక విధులు నిర్వర్తించనున్నాడు. ఆగస్టులో ఆరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు తనకు తానుగా దూరమైన ఎం.ఎస్ ధోని జులై 31 నుంచి ఆగస్టు 15 వరకు పారా మిలటరీ బెటాలియన్లో విధులు నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ అధికారి ప్రతినిధి కల్నల్ ఆమన్ ఆనంద్ తెలిపారు. ' అధికారి వినతి మేరకు పెట్రోలింగ్ విధులు, ఇతర రోజువారీ పనులు నిర్వర్తించటంతో పాటు బెటాలియన్తో ఉండేందుకు ఆర్మీ హెడ్కార్వర్డ్స్ అనుమతించింది' అని కల్నల్ ఆనంద్ వెల్లడించారు. 38 ఏండ్ల ఎం.ఎస్ ధోని 2011లో ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్గా గౌరవ హౌదా పొందాడు. 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ (పారా) ప్రొఫెషనల్ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని.. ఈ 15 రోజుల పాటు ఆ బెటాలియన్లోనే వీధులు నిర్వర్తించనున్నాడు. ఈ సమయంలో మిగతా సైనికుల మాదిరిగానే ధోని బెటాలియన్లోనే బస చేయనున్నాడు. అతడి కోసం ఆర్మీ ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయటం లేదు. 2019 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పారా మిలటరీ సైనికాధికారుల బలిదాన్ చిహ్నంతో కూడిన వికెట్ కీపింగ్ గ్లోవ్స్ ధరించి, అందరికి ఆ చిహ్నం పరిచయం చేశాడు!. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన ధోని ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సెలక్షన్ కమిటీ రోడ్ మ్యాప్తో సిద్ధమైందని తెలిపిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఇదే సమయంలో వీడ్కోలు ఎప్పుడు తీసుకోవాలో ధోనికి తెలుసని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.