Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్తో చివరి వన్డే నేడు
- రాత్రి 7.00 గం||ల నుంచి సోనీ టెన్లో
పోర్ట్ ఆఫ్ స్పెయిన్
మూడువన్డేల సిరీస్లో టీమిం డియా 1-0 ఆధిక్యతలో నిలిచింది. తొలి వన్డే వర్షార్పణమైన నేపథ్యంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య నిర్ణయాత్మక మూడోమ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే కోహ్లీ సేన ఖాతాలో మరో సిరీస్ జమ కానుంది. కరేబియన్ టూర్లో టీమిండియా టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఈ టూర్ను దిగ్విజయంగా పూర్తిచేయాలన్న కసిలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఉన్నాడు. అదీగాక కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ కూడా ఈ టూర్ అనంతరం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా తాజాగా వన్డే సిరీస్పై కన్నేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్తో రెండో వన్డేలో భారత్ విజయం అందుకుంది. బుధవారం జరిగే మూడో మ్యాచ్లో గెలిచి 2-0తో సిరీస్ సాధించాలని పట్టుదలతో ఉంది. ఐతే గాయం తర్వాత పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంకా గాడిన పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 11 ఇన్నింగ్స్ల తర్వాత శతకం బాదిన విరాట్ కోహ్లీ ఊపుమీదున్నాడు. రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్, ధావన్ విఫలం కావడంతో చివరి వరకు క్రీజ్లో నిలిచి భారత్కు భారీస్కోరు అందించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ (4/31) కరీబియన్ దీవుల్లో బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. పైగా అద్భుతమైన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. మహ్మద్ షమి (2/39) కుల్దీప్ యాదవ్ (2/59) వికెట్లు తీస్తున్నా ఎక్కువ పరుగులివ్వడం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతానికి గెలుపు జట్టు కూర్పును మార్చకపోవచ్చని సమాచారం. షమికి విశ్రాంతినిచ్చి యువ ఆటగాడు నవదీప్ సైనిని కోహ్లీ వన్డేల్లో అరంగేట్రం చేయించేందుకు అవకాశం లేకపోలేదు.
ధావన్ నిరూపించుకోవాలి
టీ20 సిరీస్లో గబ్బర్ 1, 23, 3తో నిరాశ పరిచాడు. రెండో వన్డేలోనూ 2 పరుగులకే పరిమితం అయ్యాడు. టెస్టుల్లో చోటుదక్కని ధావన్కు కరీబియన్ గడ్డపై నిరూపించుకొనేం దుకు ఇంకా ఒకే అవకాశముంది. అందుకే ఇప్పుడు ఒత్తిడంతా అతడిపైనే నెలకొంది. కాట్రెల్ విసిరిన ఇన్కమింగ్ డెలివరీలకే శిఖర్ రెండుసార్లు ఔటవ్వడం గమనార్హం. రెండో వన్డేలో క్లిష్ట సమయంలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్తో రిషభ్పంత్కు పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం జట్టు యాజమాన్యం పంత్ను కీలకమైన నాలుగో స్థానంలో ఆడిస్తోంది.
భారత ఆటగాళ్లతో సరదాగా గడిపిన పొలార్డ్
విండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ వీరికి ఆతిథ్యమిచ్చాడు. ఖలీల్అహ్మద్, మయాంక్ అగర్వాల్, నవ్దీప్సైనీ, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహాలతో కలిసి పొలార్డ్ బోటులో సందడి చేశాడు. బక్రీద్ సందర్భంగా ఆటగాళ్లుమహ్మద్ షమి, ఖలీల్ అహ్మద్లకు శుభాకాంక్షలు తెలిపాడు.
విండీస్కు తాడో పేడో
టీ20 సిరీస్ చేజార్చుకున్న వెస్టిండీస్ రెండోవన్డే నెగ్గి ఈ సిరీస్నైనా కాపాడుకోవాలని భావిస్తోంది. వన్డే సిరీస్ను 1-1తో సమం చేసి పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతోంది. నిర్ణయాత్మక పోరులో గెలవాలంటే విండీస్లో హోప్, నికోలస్ పూరన్, హెట్మెయిర్ వంటి యువకులు రాణించాల్సి ఉంది. భారీ భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది. బౌలింగ్ పరంగా కరీబియన్ జట్టుకు ఇబ్బందేమీ లేదు.
టీమిండియా జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైని.
వెస్టిండీస్ జట్టు : జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రిస్ గేల్, క్యాంప్బెల్, లెవీస్, హోప్, హెట్మెయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, ఫాబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్వైట్, కీమో పాల్, షెల్డన్ కాట్రెల్, ఒషాన్ థామస్, కీమర్ రోచ్.
నాల్గులో శ్రేయస్ ?
టీమిండియా అభిమానులంతా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్పైనే భారీ ఆశలు పెట్టుకు న్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రపంచకప్ టోర్నీకి ముందునుంచీ టీమిండియాను వేధిస్తోన్న నాల్గోస్థానం భర్తీ చేసేలా శ్రేయస్ రెండో వన్డేలో రాణించడమే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వన్డేలో 5వ స్థానంలో బ్యాటింగ్కు దిగి 71 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ వన్డేలో విరాట్ కోహ్లీ(120) తర్వాత టీమిండియాలో అత్యధిక పరుగులు చేసింది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. విరాట్ కోహ్లీతో కలిసి శ్రేయస్ి 125 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అయ్యర్ ఈ మ్యాచ్లోనూ నిలకడగా రాణిస్తే నాల్గోస్థానం అయ్యర్తో భర్తీ అయ్యే అవకాశముంది.