Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ కోచ్గా సీఏసీ ఏకగ్రీవ ఎంపిక
- వేతనం ఏడాదికి రూ.8 కోట్లు
- చీఫ్ కోచ్ను ప్రకటించిన కపిల్ కమిటీ
నవతెలంగాణ-ముంబయి
ఆధునిక క్రికెట్ అనగానే అంచనాలకు అందదు. ఊహాకందని, ఊహించలేని ఎన్నో పరిణామాలు క్షణ కాలంలో జరిగిపోతుంటాయి. అందుకు కారణం క్రికెట్ విశ్లేషకులు, అభిమానులకు అంచనా వేసే అనుభవం లేకపోవటం, పొరపాటు చేయటమే కాదు. ప్రపంచ క్రికెట్లో పోటీ విశేషంగా పెరిగింది. అయినా, ఓ విషయంలో కనీస క్రికెట్ పరిజ్ఞానం తెలిసిన అభిమాని అంచనా కూడా తప్పలేదు. అదే భారత సీనియర్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ ఎంపిక. అందరూ ఊహించినట్టుగానే రవిశాస్త్రి (57) కోహ్లిసేన గురుగా కొనసాగనున్నాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) శుక్రవారం తదుపరి టీమ్ ఇండియా చీఫ్ కోచ్ను ప్రకటించింది. రవిశాస్త్రిని ముగ్గురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా ఎంచుకున్నట్టు కపిల్ దేవ్ ప్రకటించాడు. న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హసెన్, శ్రీలంక మాజీ కోచ్ టామ్ మూడీలను రెండు, మూడు ప్రాధాన్య క్రమంలో కమిటీ ఎంచుకుంది. మరో రెండేండ్ల కాంట్రాక్టు పొందిన రవిశాస్త్రి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న 2021 టీ20 ప్రపంచకప్ (ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ స్థానంలో నిర్వహించనున్న టోర్నీ) వరకూ భారత చీఫ్ కోచ్గా కొనసాగనున్నాడు.
ఐదు ప్రమాణాలు : చీఫ్ కోచ్ ఎంపిక బాధ్యత కష్టమైన పనేమీ కాదని వ్యాఖ్యానించిన క్రికెట్ సలహా సంఘం బాస్ కపిల్ దేవ్, టీమ్ ఇండి యా ప్రధాన గురు ఎంపిక ప్రక్రియలో ఐదు ప్రమాణాలు పాటించినట్టు తెలిపాడు. కోచింగ్ ఫిలాసఫీ, అనుభవం, సాధించిన విజయాలు, కమ్యూనికేషన్, ఆధునిక శిక్షణ పద్దతులపై అవగాహన వంటి ఐదు అంశాల్లో ప్రతిభ ఆధారంగా చీఫ్ కోచ్ను ఎంచుకున్నట్టు కపిల్ ప్రకటించాడు. ఇంటర్వ్యూకు ఆరుగురు ఎంపికవగా.. ఆఖరు నిమిషంలో ఫిల్ సిమోన్స్ రేసు నుంచి తప్పుకున్నాడు. మైక్ హెసన్, రాబిన సింగ్, లాల్చంద్ రాజ్పుత్లు కమిటీ ముందు నేరుగా హాజరుకాగా.. రవిశాస్త్రి, టామ్ మూడీ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కమిటీ ముందుకొచ్చారు. మూడీ ఆస్ట్రేలియా నుంచి, శాస్త్రి వెస్టిండీస్ నుంచి టెలి కాన్ఫరెన్స్లో హాజరు కావాల్సి ఉండటంతో సీఏసీ శుక్రవారం రోజంతా ఇంటర్వ్యూ ప్రక్రియలోనే మునిగిపోయింది. చివరగా రవిశాస్త్రి కమిటీ ముందుకొచ్చినట్టు సమాచారం. రాబిన్ సింగ్ ఐపీఎల్ మెగా జట్టు ముంబయి ఇండియన్స్ కోచింగ్ సిబ్బందిలో ఒకరు కాగా, లాల్చంద్ రాజ్పుత్ 2007 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టుకు మేనేజర్. అఫ్గనిస్థాన్, జింబాబ్వేలకు చీఫ్ కోచ్గా పని చేశారు. మైక్ హెసన్ న్యూజిలాండ్ను 2005లో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్స్కు చేర్చగా.. టామ్ మూడీ ఐపీఎల్లో సన్రైజర్స్ను విజేతగా నిలిపాడు. శ్రీలంక జాతీయ జట్టుకు చీఫ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది.
సహాయకుల సంగతి తేలాలి : బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం చీఫ్ కోచ్ను క్రికెట్ సలహా సంఘం ఎంపిక చేయాలి. సహాయక సిబ్బంది (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లు)ని సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాలి. సహాయక కోచ్ల ఎంపికనూ పూర్తి చేస్తామని కపిల్ దేవ్ సీఏసీ కమిటీ పాలకుల కమిటీకి లేఖ రాసింది. దీనిపై వినోద్ రారు, ఎడుల్జీ, రవి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ కొనసాగే అవకాశం కనిపిస్తుండగా.. బ్యాటింగ్ కోచ్ సంజరు బంగర్పై వేటు పడే అవకాశం మెండుగా ఉంది. ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్కు ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ (దక్షిణాఫ్రికా) నుంచి గట్టి పోటీ ఉంది. చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుని సహాయక కోచ్లను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.
రెండు ప్రపంచకప్లు : రవిశాస్త్రి టీమ్ ఇండియాతో నాల్గోసారి కొనసాగను న్నాడు. 2007లో బంగ్లాదేశ్ పర్యటనలో క్రికెట్ మేనేజర్తో మొదలైన రవిశాస్త్రి సెకండ్ ఇన్నింగ్స్ ప్రయాణం, కోహ్లిసేనతో చీఫ్ కోచ్గా అప్రతిహాసంగా కొనసాగుతోంది. 2015లో డైరెక్టర్గా, 2019 చీఫ్ కోచ్గా రవిశాస్త్రి ఉన్న సమయంలో భారత్ ప్రపంచకప్ సెమీఫైనల్లోనే పరాజయం పాలైంది. ఇప్పుడు రవిశాస్త్రి రానున్న రెండేండ్లలో మరో రెండు ప్రపంచకప్లు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు. 2020 టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియాలో జరుగనుంది. 2021 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వాల్సిన భారత్, దాని స్థానంలో టీ20 ప్రపంచకప్కు వేదిక కానుంది. దీంతో రెండేండ్లలో రెండు ప్రపంచకప్లు శాస్త్రికి పరీక్ష పెట్టనున్నాయి. 2023 వన్డే వరల్డ్కప్కు భారత్ వేదిక కావటంతో.. ఈ రెండు టీ20 ప్రపంచకప్లో ఏది కోహ్లిసేన నెగ్గినా రవిశాస్త్రి 2023 వరకూ చీఫ్ కోచ్గా కొనసాగే అవకాశం లేకపోలేదు.
రవిశాస్త్రి కెరీర్ గ్రాఫ్
అంతర్జాతీయ అనుభవం : 80 టెస్టులు, 150 వన్డేలు
కోచింగ్ అనుభవం : 2017 నుంచి భారత జట్టు చీఫ్ కోచ్, 2014-16లో భారత జట్టు టీమ్ డైరెక్టర్, 2007 బంగ్లా పర్యటనలో క్రికెట్ మేనేజర్.
ఇతర అనుభవం : 2009-16 వరకు ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు, 1995-2017 సమయంలో క్రికెట్ వ్యాఖ్యాత.