Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనమైన వారసత్వం నిర్మిస్తాం
- జూనియర్లతో సున్నితంగా తరం మార్పు
- చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రాధామ్యాలు ఇవే
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా) : భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా మరో 26 నెలలు కాంట్రాక్టు పొందిన రవిశాస్త్రి, ఈసారి రెండు ప్రపంచకప్లు ఎదుర్కొనున్నాడు. 2020 టీ20 వరల్డ్కప్, 2021 టీ20 ప్రపంచకప్లు శాస్త్రి హయాంలో జరుగనున్నాయి. ఇందులో ఒకటి ఆస్ట్రేలియాలో జరుగనుండగా, 2021 వరల్డ్కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. కోచ్ కెరీర్లో ఒక్క మెగా ఈవెంట్ నెగ్గని రవిశాస్త్రికి ఇది కఠిన పరీక్ష. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తన ప్రాధామ్యాలను వెల్లడించాడు. చీఫ్ కోచ్గా తిరిగి నియమితులైన రవిశాస్త్రి బీసీసీఐ ట్విట్టర్ ద్వారా క్రికెట్ సలహా సంఘానికి కృతజ్ఞతలు తెలిపాడు. ' నాపై నమ్మకం ఉంచి చీఫ్ కోచ్గా ఎంపిక చేసిన సీఏసీకి తొలుత కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారత జట్టులో భాగం కావటం ఓ గొప్ప గౌరవం. నేను ఇక్కడికి రావటానికి (చీఫ్ కోచ్గా) ఈ జట్టుపై నాకున్న నమ్మకమే. ఘనమైన వారసత్వం నిర్మించగల సత్తా ఈ జట్టుకు ఉంది. ఇందు కోసం ప్రయోగాలు కొనసాగిస్తాం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి కొత్త ఆటగాళ్లు వస్తారు. అదే విధంగా టెస్టుల్లోనూ కొత్త ఆటగాళ్లను ప్రయోగిస్తాం. బౌలింగ్ విభాగంలో మరో నలుగురు స్పెషలిస్ట్లను సిద్ధం చేయాలనేది ప్రణాళిక. వచ్చే రెండేండ్లలో సున్నితంగా తరం మార్పిడి చేయటమే లక్ష్యం. ఎంతోమంది యువ ఆటగాళ్లు జట్టులోకి రానున్నారు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.