Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలైవాస్పై బుల్స్ పైచేయి
- ప్రొ కబడ్డీ లీగ్ 7
చెన్నై : ప్రొ కబడ్డీ లీగ్ 7లో సొంతగడ్డ ఏ జట్టుకూ కలిసి రావటం లేదు!. తెలుగు టైటాన్స్ మొదలుకొని, గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ వరకూ సొంతగడ్డపై దారుణ పరాజయాలు చవిచూశాయి. తాజాగా ఈ జాబితాలోకి తమిళ తలైవాస్ చేరుతున్నట్టుగా అనిపిస్తోంది. పీకెఎల్ 7 మ్యాచులు శనివారం చెన్నైలో మొదలయ్యాయి. సొంత అభిమానుల నడుమ తొలి మ్యాచ్లో బెంగళూర్ బుల్స్తో ఢీ కొట్టిన తమిళ తలైవాస్ 21-32తో ఓటమి పాలైంది. విరామ సమయానికి 17-10తో ఏడు పాయింట్ల ముందంజలో నిలిచిన బెంగళూర్ బుల్స్.. ద్వితీయార్థంలో ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. స్టార్ రైడర్ పవన్ షెరావత్ మరోసారి చెలరేగాడు. 11 పాయింట్లతోత బుల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ 13 రైడ్లలో 2 పాయింట్లే సాధించినా, పవన్ మెరుపులతో బుల్స్ జోరు తగ్గలేదు. డిఫెండర్ సౌరభ్ నందల్ ఐదు ట్యాకిల్స్ చేశాడు. ఇదే సమయంలో తమిళ తలైవాస్ స్టార్స్ రాహుల్ చౌదరి, అజరు ఠాకూర్ నిరాశపరిచారు. రాహుల్ రెండు పాయింట్లే సాధించగా, అజరు నాలుగు పాయింట్లు తీసుకొచ్చాడు. రణ్ సింగ్ మూడు ట్యాకిల్స్తో రాణించాడు. ఏ దశలోనూ బుల్స్కు పోటీ ఇవ్వలేని తలైవాస్ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్ టైగా ముగిసింది. భీకర ఫామ్లో ఉన్న దబంగ్ ఢిల్లీ, జోరు మీదున్న బెంగాల్ వారియర్స్ 30-30తో పాయింట్లను పంచుకున్నాయి. ప్రథమార్థంలో 18-11తో ఢిల్లీ ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలో బెంగాల్ పుంజుకుంది. చివరి పది నిమిషాల్లో దాదాపుగా ఇరు జట్లూ సమవుజ్జీలుగా సాగాయి. ఆఖరు రైడ్కు ముందు ఢిల్లీ 30-29తో ముందంజలో నిలిచింది. చివరి కూతలో ప్రపంజన్ పాయింట్ సాధించి బెంగాల్కు ఓటమి తప్పించాడు. చావోరేవో రైడ్లో ఢిల్లీ డిఫెండర్ సయీద్ గఫారీని అవుట్ చేసి ఉత్కంఠ మ్యాచ్కు టైతో ముగింపు పలికాడు. పీకెఎల్7లో నేడు తెలుగు టైటాన్స్తో హర్యానా స్టీలర్స్ తలపడనుంది. మరో మ్యాచ్లో ఆతిథ్య జట్టు తమిళ తలైవాస్తో పుణెరి పల్టన్స్ ఢీ కొట్టనుంది.