Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 పాయింట్లతో సిద్దార్థ్ దేశాయ్ జోరు
- 40-29తో హర్యానాపై టైటాన్స్ గెలుపు
- ప్రొ కబడ్డీ లీగ్ 7 సీజన్
నవతెలంగాణ-చెన్నై
ఆరు సీజన్లుగా స్టార్ రైడర్ రాహుల్ చౌదరితో సాధ్యం కాని టైటిల్ స్వప్నం, ఈ సారి బాహుబలి తీర్చేస్తాడని ఆశలు పెట్టుకున్న తెలుగు టైటాన్స్కు ఆరంభ మ్యాచుల్లో భంగపాటు తప్పలేదు. విపరీత అంచనాల నడుమ బాహుబలి ఒత్తిడికి చిత్తయ్యాడు. సీజన్ ఆరంభంలో తడబడిన తెలుగు టైటాన్స్, సాగుతున్న కొద్దీ మెరుగవుతోంది. బాహుబలి రైడర్ సిద్దార్థ్ దేశాయ్ సైతం మ్యాచు మ్యాచుకు రెట్టింపు జోరు చూపిస్తున్నాడు. ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో హర్యానా స్టీలర్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 11 పాయింట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 40-29తో సీజన్లో తొలిసారి తిరుగులేని విజయం నమోదు చేసింది. స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 18 పాయింట్లతో చెలరేగాడు. గత మూడు మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన తెలుగు టైటాన్స్, చెన్నైలోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచీ ఆఖరు నిమిషం వరకూ తెలుగు టైటాన్స్ మ్యాచ్పై తిరుగులేని పట్టుతో కనిపించింది. ప్రథమార్థంలోనే సిద్దార్థ్ పంజా విసిరాడు. 9 రైడ్లలో 8 పాయింట్లు సాధించి విరామ సమయానికి టైటాన్స్ను 21-13తో ఆధిక్యంలో నిలిపాడు. అతడికి సురజ్ దేవాయ్ అండగా నిలిచాడు. డిఫెండర్లు విశాల్ భరద్వాజ్, అబోజర్లు చెరో మూడు ట్యాకిల్స్తో స్టీలర్స్ను కట్టడి చేశారు. సురజ్ దేశాయ్ ఆరు పాయింట్లతో మెరువ గా, సి. అరుణ్ రెండు ట్యాకిల్స్ చేశాడు. హర్యానా తరఫున వికాశ్ 9 పాయింట్లు సాధించాడు. వినరు (4), ప్రశాంత్ (3) రాణించారు. వరుసగా ఐదు ఓట ములు చవిచూసిన టైటాన్స్.. తర్వాత రెండు మ్యాచులు టై చేసుకోగా, రెండు విజయాలు సాధించింది.
రాహుల్ ముంచాడు! : తమిళ తలైవాస్ సొంతగడ్డపై మరో విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరు రైడ్ వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో పుణెరి పల్టన్తో కలిసి తలైవాస్ పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఆఖరు నిమిషంలో 30-29తో తమిళ తలైవాస్ ముందంజలో నిలిచింది. ఈ సమయంలో చావోరేవో కూతకెళ్లిన రాహుల్ చౌదరిని పుణెరి పల్టన్ డిఫెండర్ సుర్జీత్ సింగ్ సూపర్ ట్యాకిల్ చేశాడు. దీంతో రెండు పాయింట్లు సాధించిన పుణెరి 31-30తో ముందంజ వేసింది. ఆఖరి రైడ్ (డూ ఆర్ డై)లో పుణెరి రైడర్ మంజీత్ను తలైవాస్ డిఫెండర్ వినీత్ శర్మ ట్యాకిల్ చేసి స్కోరు సమం చేశాడు. తలైవాస్కు సొంతగడ్డపై వరుసగా రెండో ఓట మిని తప్పించాడు. 23 సార్లు కూతకెళ్లిన రాహుల్ చౌదరి కేవలం 8 పాయింట్లు సాధించగా..11 రైడ్లలోనే అజి త్ కుమార్ 8 పాయింట్లు సాధించాడు. రణ్ సింగ్ 4, వినీత్ శర్మ 3 ట్యాకిల్స్తో మెరిశారు. కెప్టెన్ అజరు ఠాకూర్ ఈ సారి ఒక్క పాయింట్తోనే సరిపెట్టుకు న్నాడు. పుణెరి తరఫున సుర్జీత్ సింగ్ 7, పంకజ్ మోహి తె, 7, నితిన్ తోమర్ 5, మంజీత్ 5 రాణించారు.