Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సవరణలతో సుప్రీంకోర్టు ముందుకు సీఓఏ
- ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో ఎడుల్జీ, రవి భేటి
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఇటీవల కాలంలో ఎక్కువగా వేధిస్తోన్న అంశం పరస్పర విరుద్ధ ప్రయోజనాలు. బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం ' ఒక సమయంలో ఒక వ్యక్తికి ఒకే పదవి' నిబంధనను ఉల్లంఘిస్తే సదరు వ్యక్తి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్టు అవుతుంది. అనుచిత లబ్ది, బంధు ప్రీతి, అవినీతి వంటి సమస్యలపై వేటు వేసేందుకు జస్టిస్ లోధా కమిటీ ఈ సిఫారసు చేసింది. పరిపాలన విభాగంలో ఇది అధిక ప్రయోజకారి అవుతున్నా, క్రికెట్ సర్క్యూట్కు వచ్చేసరికి ఇబ్బందికరంగా మారుతోంది. భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లగల దిగ్గజ క్రికెటర్లు బోర్డుతో కలిసి పని చేసేందుకు ఇది అడ్డుగా మారుతోంది. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా నియమించిన తర్వాత, అతడికి అంబుడ్స్మన్ నోటీసులు జారీ చేయటం చర్చనీయాంశమైంది. క్రికెట్కు తిరిగి సేవలు అందించగల వారిని వినియోగించుకునే పరిస్థితిలో లేకపోతే, భారత క్రికెట్ను ఎవరు ముందుకు తీసుకెళ్తారు? అనే ప్రశ్న ఎదురవుతోంది. దీనిపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బహిరంగ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పాలకుల కమిటీ ఈ అంశంపై దృష్టి సారించింది. సీఓఏ సభ్యులు డయాన ఎడుల్జీ, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రవి సోమవారం ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో ఈ అంశంపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. భారత క్రికెట్ విస్తృత ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ఏ విధంగా మార్పు చేయాలని ఆలోచన చేశారు.
త్వరలోనే శ్వేత పత్రం : 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో అన్ని సమస్యలు చర్చించాం. అమలులో క్రికెటర్లు, ఆఫీస్ బేరర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాం. అర్థవంతమైన చర్చ జరిగింది. క్రికెటర్లు కొన్ని వాస్తవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విషయాలపై విభేదించినా, కొన్నింటిని అంగీకరించాం. వాస్తవ సమస్యలు తెలుసుకోవటం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సీఓఏ తర్వాతి సమావేశంలో దీనిపై చర్చిస్తాం. ప్రస్తుతానికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన యథాతథంగా కొనసాగుతుంది. సవరణల కోసం ఓ శ్వేత పత్రం సిద్ధం చేసి, సుప్రీంకోర్టు సహాయకారి (అమీకస్ క్యూరి)కి అందజేస్తాం. సుప్రీంకోర్టు అంగీకరిస్తే భారత క్రికెట్ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా విరుద్ధ ప్రయోజనాలకు విరుగుడు దొరుకుతుంది' అని సీఓఏ సభ్యురాలు డయాన ఎదుల్జీ పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ గంగూలీ వీడియో చాట్ (స్కైప్) ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. దిలీప్ వెంగ్సర్కార్, సంజరు మంజ్రేకర్, అజిత్ అగార్కర్, పార్దీవ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, రోహన్ గవాస్కర్లు సమావేశంలో పాల్గొన్నారు. కుటుంబ కారణాల రీత్యా వీవీఎస్ లక్ష్మణ్ భేటికా రాలేదు. సచిన్ టెండూల్కర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. స్వయంగా విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్నందున ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ ద్రవిడ్ నిరాకరించాడు.