Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్ కోహ్లి వ్యూహ రచనకు పరీక్ష
- గతంలో ఎన్నో ఎంపిక తప్పిదాలు
- రేపటి నుంచి విండీస్తో టెస్టు సమరం
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రపంచకప్ ప్రణాళికలో ఎనిమిది మాసాలు గడిపిన టీమ్ ఇండియా తిరిగి ఐదు రోజుల ఆటకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు విజయం తర్వాత కోహ్లిసేన నార్త్సౌండ్లోనే తొలి టెస్టు ఆడనుంది. ధనాధన్ దూకుడు నుంచి విసుగు తెప్పించే డిఫెన్స్కు మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో సాధన చేసిన టీమ్ ఇండియా తొలి టెస్టుకు ముందు కొన్ని ఆసక్తికర సవాళ్లు ఎదుర్కొంటుంది. నాణ్యమైన జట్టుతో సిరీస్లు సాధించేలా కనిపించినా కెప్టెన్ కోహ్లి తుది జట్టు ఎంపిక తప్పిదాలతో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత్ దారుణంగా భంగపడింది. గత అనుభవాల దృష్ట్యా నార్త్సౌండ్ టెస్టుకు తుది జట్టుకు కోహ్లి ఏ విధంగా రూపకల్పన చేయనున్నాడు? సరైన గుర్రాలనే రేసులో నిలుపుతాడా? అనే ఆసక్తి నెలకొంది.
భారత బ్యాటింగ్ లైనప్లో ఓ మార్పు. తొలిసారి టాప్ ఆర్డర్లో తొలి నలుగురు ఆటగాళ్లు ఎవరనే బెంగ ఇప్పుడు లేదు. యువ ఆటగాడు పృథ్వీ షా జట్టులో లేని వేళ టాప్-4 ఎవరనే ఆసక్తి లేదు. మెల్బోర్న్లో అరంగ్రేటంలోనే 76, 42 పరుగులతో మెరిసిన మయాంక్ అగర్వాల్, గురువారం కెఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార, కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా 3, 4 స్థానాల్లో వస్తారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కోహ్లి తర్వాత క్రీజులోకి వచ్చేదెవరు? వికెట్ల వెనకాల నిలబడేది ఎవరు? తుది జట్టులో నిలిచే స్పిన్నర్ ఎవరు? అనే ప్రశ్నలు మిగిలిపోయాయి. ఆంటిగ్వాలో కోహ్లి వీటికి సమాధానం చెప్పనున్నా, అతడికి ఉన్న అవకాశాలు ఏమిటో ఓ సారి చూద్దాం.
ముగ్గురులో ఇద్దరు : ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య జట్టులో లేడు. వెస్టిండీస్ పిచ్లు సహజ రీతిలో పేసర్లకు అనుకూలం. ఈ నేపథ్యంలో భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్తో బరిలోకి దిగనుంది. టాప్-4 తర్వాత మరో ఇద్దరికే అవకాశం. రేసులో ముగ్గురు ఉండగా ఒకరిని పన్కనపెట్టాల్సి రావటం ఎప్పుడూ కష్టమైన ఎంపికే. ఈ రేసులో తెలుగు తేజం హనుమ విహారి ముందున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఓపెనర్గానూ వచ్చిన విహారి తక్కువ కాలంలోనే ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున అనధికార టెస్టులో అజేయ సెంచరీ సాధించాడు. వార్మప్ మ్యాచ్లోనూ అర్ధ సెంచరీతో మెరిశాడు. బలహీనతలు తక్కువున్న విహారి ఓ స్థానం ఖాయం చేసుకున్నట్టే చెప్పాలి. రేసులోని మరో బ్యాట్స్మన్ రోహిత్ శర్మ. టెస్టుల్లో తక్కువ అవకాశాలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే తీరిక లేకపోవటం రోహిత్కు ప్రతికూలమని చెప్పాలి. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రహానెను కాదని రోహిత్ను తీసుకోవటం విమర్శలకు తావిచ్చింది. అయినా కెప్టెన్ ఆ నిర్ణయాన్ని మరోసారి తీసుకునేందుకు వెనుకాడక పోవచ్చు. మెల్బోర్న్ టెస్టులో అజేయ అర్ధసెంచరీ బాదిన రోహిత్ శర్మ.. తాజాగా వార్మప్లోనూ రాణించాడు. మిడిల్ ఆర్డర్లో స్థానానికి బలమైన పోటీదారుగా నిలిచాడు. ఈ రేసులో మూడో ఆటగాడు, వైస్ కెప్టెన్ అజింక్య రహానె. తుది జట్టులో నేరుగా నిలిచే స్థానం నుంచి రహానె ఈ స్థితికి దిగజారాడు. రెండేండ్లు, 17 టెస్టులుగా రహానె సెంచరీ చేయలేదు. ఆసీస్ పర్యటన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ రహానె సగటు 27. వార్మప్లో తొలి ఇన్నింగ్స్లో భంగపడినా, రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా అర్ధ సెంచరీ సాధించాడు. తాజా ఫామ్తో వెళ్తామని చెప్పే కోహ్లి నార్త్సౌండ్లో రహానెను కాదని రోహిత్ శర్మను తీసుకుంటాడేమో చూడాలి.
గ్లౌవ్స్ ఎవరి చేతికి? : అంతర్జాతీయ క్రికెట్లో ఒక అలిఖిత నిబంధన ఉంది!. జట్టులో సుస్థిర స్థానం కలిగిన ఆటగాడు గాయంతో దూరమైనప్పుడు, పునరాగమనంలో అతడిని నేరుగా తుది జట్టులోకి తీసుకుంటారు. వృద్దిమాన్ సాహా ఓ గాయంతో జట్టుకు దూరమై మూడు గాయాలకు చేరుకున్నాడు. 18 నెలలు టెస్టు జట్టుకు దూరమయ్యాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ వరుసగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో శతకాలతో చెలరేగాడు. ఫస్ల్ క్లాస్ క్రికెట్ పునరాగమనంలో సాహా ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున అనధికార టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు కొట్టాడు. రెండు మ్యాచుల టెస్టు సిరీస్లో తొలి టెస్టు జట్టును దాదాపుగా మార్చరు. అత్యవసరం అనిపిస్తే తప్ప అదే జట్టును కొనసాగిస్తారు. టెస్టుల్లో పంత్ ఫటాఫట్ ఫామ్లో ఉన్న నేపథ్యంలో సాహాకు గ్లౌవ్స్ అందేది అనుమానమే!.
ముగ్గురులో మాయగాడెవరు? : భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్తో ఆడితే ఒక స్పిన్నర్కే జట్టులో చోటు ఉంటుంది. పేస్ విభాగంలో జశ్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి ఉన్నారు. ఒక స్పిన్నర్తోనే ఆడాల్సి వచ్చినప్పుడు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లలో ఎవరు తుది జట్టులో ఉంటారు?. విదేశీ టెస్టుల్లో కుల్దీప్ యాదవ్ మా నం.1 స్పిన్నర్ అని కోచ్ రవిశాస్త్రి ఆసీస్పై టెస్టు విజయం అనంతరం పేర్కొన్నాడు. కెప్టెన్ కోహ్లి ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తే నేరుగా కుల్దీప్ జట్టులోకి వస్తాడు. అంటే, వెస్టిండీస్లో గత టెస్టు సిరీస్ విజయంలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' విన్నర్ అశ్విన్కు బెంచ్కు పరిమితం అవుతాడు. ఒకవేళ భారత్ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాల్సి వస్తే రవీంద్ర జడేజా రేసులోకి వస్తాడు. బ్యాట్స్మన్గా జడేజా అనుభవం జట్టుకు పనికొస్తుంది. స్పిన్నర్గా టెస్టుల్లో జడేజా ఎన్నడూ నిరాశపరచలేదు. ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చిన అశ్విన్ నేరుగా తుది జట్టులో చోటు ఆశిస్తున్నాడు. ముగ్గురిలో మాయగాడెవరు అనేది కోహ్లి తేల్చాలి.
ఈ మూడు డైలామాల్లో మిడిల్ ఆర్డర్లో ఏ ఇద్దరు జట్టులోకి వచ్చినా పెద్ద వ్యత్యాసం ఉండబోదు!. కానీ స్పిన్నర్, వికెట్ కీపర్ ఎంపిక పూర్తి భిన్నం. ఇక్కడ తప్పుడు ఎంపిక, ఫలితాన్ని తారుమారు చేయగలదు. ప్రత్యేకించి టెస్టుల్లో వికెట్ కీపర్ను బ్యాటింగ్ నైపుణ్యం చూసి ఎంచుకోకుడదు. పేసర్లకు తోడుగా వికెట్ల మాయజాలం చేయగల స్పిన్నర్ విషయంలోనూ ఇదే సూత్రం. మరి, నార్త్సౌండ్లో కెప్టెన్ కోహ్లి, కోచ్ శాస్త్రి తుది జట్టుకు ఏ కొలమానంతో తుది రూపు ఇస్తారో చూడాలి.