Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో తెలుగు తేజం
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్
బసెల్ (స్విట్జర్లాండ్) : బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో ఐదో సీడ్ భారత స్టార్ పి.వి సింధు పసిడి వేట ఘనంగా మొదలైంది. తొలి రౌండ్లో బై లభించగా, రెండో రౌండ్లో సింధు అలవోక విజయం సాధించింది. చైనీస్ తైపీ షట్లర్ పై యు పోపై వరుస గేముల్లో గెలుపొందింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. 21-14, 21-15తో సింధు సులువుగా ముందంజ వేసింది. ప్రపంచ చాంపియన్షిప్స్లో వరుసగా రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించిన సింధు తాజాగా స్వర్ణంపై కన్నేసి బరిలోకి దిగింది. మహిళల డబుల్స్లో భారత్కు నిరాశే ఎదురైంది. అశ్విని, సిక్కి రెడ్డి జంట పరాజయం పాలైంది. 42 నిమిషాల మ్యాచ్లో సింధుకు ఎదురులేదు. వరల్డ్ నం.5 సింధు తొలి గేమ్ను 11-7తో దూకుడుగా మొదలెట్టింది. తొలి గేమ్ను 21-14తో 18 నిమిసాల్లోనే ముగించింది. రెండో గేమ్లో పై యుపై పుంజుకునే ప్రయత్నం చేసింది. ప్రథమార్థంలో 11-10తో సింధుపై ఆధిక్యం సాధించింది. విరామం తర్వాత సింధు ఎదురుదాడిని చైనీస్ తైపీ షట్లర్ ఎదుర్కొలేదు. వరుస పాయింట్లు సాధించిన సింధు 21-15తో 24 నిమిషాల్లో రెండో గేమ్ను, ప్రీ క్వార్టర్స్ బెర్త్ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో అమెరికా షట్లర్ బీవెన్ జాంగ్తో తలపడనుంది. మహిళల డబుల్స్లో మేఘన జక్కంపూడి, పూర్విశ జోడీ 8-21, 18-21తో పరాజయం పాలైంది. అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ 20-22, 16-21తో ఏడో సీడ్ చైనా జంట చేతిలో పరాభవం చవిచూసింది.