Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పదునెక్కిన కరీబియన్ పేస్
- పేస్లో భారత్ సైతం ప్రమాదకారి
నవతెలంగాణ క్రీడా విభాగం
కరీబియన్ పేసర్లను ఎదుర్కొవటం ఓ జీవన్మరణ సమస్య. విండీస్ పిచ్లపై కరీబియన్ సీమర్లు నిప్పులు చెరిగే బంతులకు బ్యాట్స్మెన్ వద్ద సమాధానమే లేకపోయింది. జోఫ్రా ఆర్చర్ (వెస్టిండీస్ జాతీయుడు) సంధించిన బౌన్సర్కు బలైన ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ ఇంకా కోలుకోలేదు. అధునాతన రక్షణ కవచాలతో ఆడినా, బౌన్సర్ల ప్రమాదానికి విరుగుడు లేదు. అలాంటిది ఆ రోజుల్లో విండీస్ పేసర్లను ఎదుర్కోవటం ఎంత కష్టమో సులువగానే ఊహించవచ్చు. గతం గొప్పతనంతోనే ఈ శతాబ్దంలో తొలి దశాబ్దం గడిపింది వెస్టిండీస్. కానీ ఇటీవల కరీబియన్ పేస్కు మళ్లీ పదునెక్కింది. ఇంటా, బయటా వ్యత్యాసం లేకుండా కరీబియన్ సీమర్లు బ్యాట్స్మెన్కు సవాల్ విసురుతున్నారు. జేసన్ హౌల్డర్, గాబ్రియల్, కీమర్ రోచ్ త్రయం నుంచి కోహ్లిసేనకు పెను మప్పు పొంచి ఉంది. నేటి నుంచి భారత్, వెస్టిండీస్ టెస్టు సిరీస్ ఆరంభం.
2019 ప్రపంచకప్ ముగియగానే ఓ వార్త భారత క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాళ్ల విరాట్ కోహ్లి, జశ్ప్రీత్ బుమ్రాలకు కరీబియన్ పర్యటన నుంచి విశ్రాంతి లభించనుందనే ఊహాగానాలు చెలరేగాయి. అందులో వాస్తవం లేకపోయినా, ఆ సాహాసం చేయలేకపోవడానికి మాత్రం ఓ బలమైన కారణం ఉంది!. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఆరంభం నేపథ్యంలో బలమైన వెస్టిండీస్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడానికి భారత్కు విరాట్ కోహ్లి అవసరం. పేస్కు గొప్పగా సహకరిస్తున్న విండీస్ పిచ్లపై ఆతిథ్య బ్యాట్స్మెన్ నడ్డి విరిచేందుకు ప్రధాన సీమర్ జశ్ప్రీత్ బుమ్రా కీలకం.
పరుగులు సులువు కాదు బాసూ : 2000-10 కాలంలో వెస్టిండీస్లో టెస్టు క్రికెట్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. నాణ్యమైన సీమర్ల కొరతతో విండీస్ పిచ్ల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది. నెమ్మదైన పిచ్ల రూపకల్పనతో టెస్టు సమరాలు విసుగు తెప్పించాయి. ఫలితంగా ప్రతి ఐదు టెస్టుల్లో రెండు డ్రాగా ముగిశాయి. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యల్పం. ఇదే సమయంలో బ్యాటింగ్ సగటు పడిపోగా, స్ట్రయిక్ రేట్ అదే దారిలో నడిచింది. విచిత్రంగా విండీస్ పిచ్లు అటు బౌలింగ్కు, ఇటు బ్యాటింగ్కు కష్టతరంగా మారాయి. పేసర్లు సహా స్పిన్నర్లకు వికెట్లు దక్కటం గగనమైంది. పరుగులు సాధించటం బ్యాట్స్మెన్కు భారమైంది. క్రికెట్లో ప్రధానమైన బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలించని పిచ్లపై టెస్టులను ఎవరు ఆస్వాదిస్తారు?. 2017 నుంచి విండీస్ గడ్డపై టెస్టుల్లో బ్యాటింగ్ సగటు 23.24 మాత్రమే. ఓ మ్యాచ్లో 50 ప్లస్ పరుగుల భాగస్వామ్యాల సగటు 4.73. ప్రపంచ టెస్టు దేశాల్లో విండీస్తో అత్యల్ప సగటు.
డ్యూక్తో దూకుడు : ప్రపంచకప్కు ముందు ఇంగ్లాండ్ జట్టు కరీబియన్ దీవుల్లో పర్యటించింది. భారత్ను 4-1తో, శ్రీలంకను 3-0తో చిత్తుగా ఓడించిన రూట్ సేన.. బలహీన వెస్టిండీస్పై భారీ విజయాన్ని లాంఛనం అనుకొంది. అప్పటికే భారత్, బంగ్లాదేశ్ చేతిలో 0-2తో టెస్టు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ నుంచి మెరుగైన ప్రదర్శనను ఎవ్వరూ ఊహించలేదు. కానీ తొలి రెండు టెస్టులు ముగియగానే వెస్టిండీస్ 2-0తో సిరీస్ను సొంతం చేసుకుంది. వరల్డ్ నం.2గా వేట మొదలెట్టిన ఇంగ్లాండ్ ఐదో ర్యాంక్కు పడిపోయింది. అందుకు కారణం ముగ్గురు సీమర్లు జేసన్ హౌల్డర్, గాబ్రియల్, కీమర్ రోచ్.
దక్షిణాఫ్రికా పిచ్లను విశేష రీతిలో మార్పు చేసిన వారిలో ఒటిస్ గిబ్సన్ ప్రముఖులు. సఫారీ పిచ్లను అంతలా మార్చాల్సిన అవసరం లేదని అనేవారు లేకపోలేదు. కానీ క్రికెట్లో పోటీతత్వాన్ని కోల్పోయిన, కొత్త జీవం కోసం అన్వేషిస్తున్న వెస్టిండీస్కు అది అత్యవసరం. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు కరీబియన్లు అదే పని చేశారు. కరీబియన్ గడ్డపై వినియోగించే కూకాబుర్రా బంతి బదులు డ్యూక్ను ఎంచుకున్నారు. పచ్చికతో కూడిన బౌన్సీ వికెట్లను సిద్ధం చేశారు. డ్యూక్ బంతులతో వాడే ఇంగ్లాండ్పై పచ్చిక పిచ్లు ఆత్మహత్య సదృశ్యంగా ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ అప్పట్లో అభివర్ణించాడు. సహాయక కోచింగ్ సిబ్బంది నిక్ పోథాస్, స్టువర్ట్ లా హెచ్చరించినా వెస్టిండీస్ పాత తరం పిచ్లకే ఓటేసింది. ఫలితం ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్ టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది.
ఆ ముగ్గురు : 2011 నుంచి వెస్టిండీస్ బౌలింగ్లో పెను మార్పు కనిపించింది. 2000-10 కాలంలో విండీస్ బౌలింగ్ సగటు 34.65. అదే 2011 నుంచి 27.72కు వచ్చింది. వ్యత్యాసం -6.93. టెస్టు దేశాల్లో ఇంతటి పురోగతి సాధించిన ఏకైక జట్టు వెస్టిండీస్. ఇదే కాలంలో భారత్ 37.41 నుంచి 32.2కు చేరుకుంది. వ్యత్యాసం -5.21. ప్రత్యేకించి పేస్ బౌలింగ్లో విండీస్ సగటు 25.44 (2011 నుంచి). అదే 2017 నుంచి గణాంకాలు 21.11కు మెరుగైంది. భారత్ ఈ విషయంలో 36.9 నుంచి 29.76కు మెరుగైంది. వెస్టిండీస్ బౌలర్ల మెరుపులతో ఈ దశాబ్ద కాలంలో బ్యాటింగ్కు కష్టతరంగా విండీస్ పిచ్లు మారాయి. బ్యాట్స్మెన్ నియంత్రణలో లేని బంతుల శాతం క్రమంగా పెరుగుతూ పోతుంది. 2000లో 18.33, 2011 నుంచి 15.64, 2017 నుంచి 21.63 శాతం బంతులు బ్యాట్స్మెన్ నియంత్రణలో ఉండటం లేదు. వికెట్ల వేటకు మార్గం సుగమం చేసేది ఈ నియంత్రణ సాధించలేని బంతులే. ఈ సమయంలో వెస్టిండీస్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేశారు ముగ్గురు సీమర్లు. కెప్టెన్ జేసన్ హౌల్డర్, షానన్ గాబ్రియల్, కీమర్ రోచ్లు ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నారు. 2017 నుంచి గాబ్రియల్ 52 వికెట్లు, జేసన్ 45 వికెట్లు, కీమర్ రోచ్ 34 వికెట్లు పడగొట్టారు. జేసన్ సగటు 14.91 కాగా, కీమర్ రోచ్ 15.85, గాబ్రియల్ 19.25 సగటుతో వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై విండీస్ బౌలర్లు 19.05 సగటుతో వికెట్లు కూల్చుతుండగా.. ప్రత్యర్థి బౌలర్లు 24.16 సగటుతో వెనుకబడిపోయారు. జీవం కోల్పోతున్న వెస్టిండీస్ క్రికెట్కు పేసర్లు కొత్త శోభను తీసుకొచ్చారు. పేసర్ల మెరుపులతో బలహీనమైన బ్యాటింగ్ లైనప్ తెరపైకి రావటం లేదు.
పేస్ బౌలింగ్ పరిణితిలో వెస్టిండీస్, భారత్లది ఒకే కథ!. విదేశీ గడ్డపైనా వికెట్ల కోసం స్పిన్నర్ల వైపు చూసే టీమ్ ఇండియా ఇప్పుడు పేసర్లను మాత్రమే నమ్ముకుని విజయాలు సాధించే స్థాయికి చేరుకుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత బౌలర్లు చెలరేగారు. కంగారూ గడ్డపై వారికి బ్యాటింగ్ లైనప్ సహకారం అందటంతో 71 ఏండ్ల నిరీక్షణకు తెరదించి టెస్టు సిరీస్ విజయాన్ని కట్టబెట్టారు. జశ్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్లు కొత్త బంతితో, పాత బంతితో వికెట్ల వేటలో ముందుంటున్నారు. స్పిన్నర్ల సహకారం అవసరం లేకుండానే ప్రత్యర్థి 20 వికెట్లు కూల్చగల సత్తా భారత్ సీమర్ల సొంతం. భారత్, వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్లో పేసర్లకు అనుకూల పిచ్లు సిద్ధమవుతున్నాయి. మళ్లీ పేసర్ల స్వర్గధామంగా మారిన కరీబియన్ గడ్డపై విండీస్ మెరుస్తుందా? బుమ్రా బృందం బూమ్ బూమ్ అనిపిస్తుందా? చూడాలి.