Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే మరో సైనా, సింధులు సాధ్యం
- పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యలు
నవతెలంగాణ, హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ సూపర్స్టార్ సైనా నెహ్వాల్ 23 ఏండ్ల వయసులో ఉండగా, యువ పి.వి సింధు ప్రపంచ చాంపియన్షిప్స్ (2013) కాంస్యం సాధించింది. సైనా తర్వాత ఎవరు అనే ప్రశ్నకు సింధు సమాధానంగా నిలిచింది. సింధుకు ఇప్పుడు 24 ఏండ్లు. కానీ సింధు తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సైతం భవిష్యత్ తరంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన కోచ్లపై పెట్టుబడులు కొరవటం ఇందుకు ఓ కారణంగా చెప్పాడు. ' ఈ విషయంపై గతంలో కంటే రెట్టించిన స్వరంతో మాట్లాడాలని ప్రయత్నించాను. సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణరు, సౌరభ్, సమీర్, కశ్యప్లతో కూడిన మెరుగైన షట్లర్ల బృందమే గత 5-10 ఏండ్లుగా మెరుస్తున్నారు. వీరి తర్వాత ఓ తరం రావాల్సి ఉంది' అని గోపీచంద్ పేర్కొన్నాడు. దురదృష్టశావత్తు మనం కోచ్లపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. సింధు, సైనాలకు వ్యక్తిగతంగా కొంత సమయం కావాలి. నాణ్యమైన కోచ్లను తయారు చేయటంలో నిజానికి విపరీతమైన శూన్యత ఏర్పడింది. శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన సమస్య కాదు. ఈ అంతరాన్ని పూడ్చగలిగే వాతావరణం ఏర్పాటు చేయాలి. విదేశీ కోచ్లు పార్క్, కిమ్, ఫ్లాండీ సహాయంతో పాటు భారత కోచ్లు అమ్రేశ్, సియాదత్, ప్రద్న్య, విజరుదీప్లతో ఈ సమస్యను గట్టెక్కుతున్నాం. ఈ సంఖ్య రెట్టింపు కావాలి. ప్రపంచ స్థాయి షట్లర్లను తయారు చేసేందుకు మెరుగైన బృందం కావాలి. లిన్ డాన్ వంటి ఆటగాడితో ఆడాల్సి వచ్చినప్పుడు అథ్లెట్తో కూర్చోని వ్యూహం గురించి వివరించే కోచ్లు షట్లర్ల వెనుక ఉండాలని గోపీచంద్ పేర్కొన్నాడు.
అగ్రశ్రేణి షట్లర్లను తీర్చిదిద్దేందుకు ప్రధాన కోచ్ల పూర్తి సమయం వెచ్చిస్తున్నారు. జూనియర్ షట్లర్లకు సమయం కేటాయించే అవకాశం చిక్కటం లేదు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు) టాప్-50 ర్యాంకర్లను విదేశీ టోర్నీలకు సొంత ఖర్చులతో పంపేది. ఇప్పుడు టాప్-30 ర్యాంకర్లను మాత్రమే పంపుతోంది. ఇది వర్థమాన షట్లర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. నిధులు ఖర్చు చేయటంలోనూ జూనియర్ క్రీడాకారులకు 40 శాతం కేటాయించాల్సి ఉన్నా, పది శాతంతోనే సరిపెడుతున్నారు. బారు ఈ ఏడాది 47 మంది అథ్లెట్లను కోర్ గ్రూప్లోకి ఎంపిక చేసింది. కానీ వారికి సైతం అవకాశాలు కల్పించటంలో తీవ్ర వైఫ్యలం చవిచూసింది. ఈ పరిణామాలపైనా గోపీచంద్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.