Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్ సిటీ ఊసెత్తని రాష్ట్ర సర్కార్
- నేడు జాతీయ క్రీడా దినోత్సవం
నవతెలంగాణ-హైదరాబాద్
'హైదరాబాద్ శివారు ప్రాంతంలో క్రీడా నగరం ఏర్పాటు చేస్తాం. అత్యాధునిక మౌళిక వసతులతో అన్ని క్రీడలను ఒకే చోట ఆడేందుకు కండ్లుచెదిరే స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తాం. ప్రతి రెండు నెలలకు ఓసారి అంతర్జాతీయ, జాతీయ, అంతరాష్ట్ర క్రీడా పోటీలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తాం. భవిష్యత్లో ఇక్కడే ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తాం'.. 2014, ఆగస్టు 6. హైదరాబాదీ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పి.వి సింధు, పారుపల్లి కశ్యప్ సహా పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్లతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటన ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో స్పోర్ట్స్ సిటీ హామీ ఇచ్చిన సీఎం కెేసీఆర్, రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినా అసలు స్పోర్ట్స్ సిటీ ఊసెత్తటం లేదు. ఇంతకూ హైదరాబాద్కు 'క్రీడా నగరి' భాగ్యం ఉందా?
నగదు బహుమతులకే పరిమితం : ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా విధానమే పాటించలేదు, తెలంగాణలో సరికొత్త క్రీడా విధానంతో క్రీడా రంగానికి బంగారు బాటలు వేస్తామని పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకూ తెలంగాణ క్రీడా విధానం ఏమిటో ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. 2014లో కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారితో పాటు ప్రాతినిథ్యం వహించిన వారికీ నగదు నజరానాలు ప్రకటించిన సీఎం కెేసీఆర్, రియో ఒలింపిక్స్కు ముంగిట క్రీడా విధానం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఒలింపిక్స్ సహా ఇతర మెగా టోర్నీల్లో పసిడి, రజతం, కాంస్యం సాధించిన క్రీడాకారులకు నగదు బహుమానం ప్రకటించటంపై ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో గరిష్టంగా ఎంత బహుమతి అయినా ఇవ్వవచ్చని అందులో ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా విధానంలో కేసీఆర్ సర్కార్ అందరి కంటే ఓ విషయంలో ముందు నిలిచింది. రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన పి.వి సింధుకు ఆంధ్రప్రదేశ్ రూ. 3 కోట్ల బహమానం ప్రకటిస్తే, తెలంగాణ సీఎం రూ. 5 కోట్ల నజరానాతో తెలంగాణ క్రీడా విధానాన్ని ఘనంగా చాటారు. పనిలో పనిగా మరోసారి హైదరాబాద్లో స్పోర్ట్స్ సిటీ బ్రహ్మాండంగా నిర్మిస్తామని హామీ ఇచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వ క్రీడా విధానం ఇప్పటికీ నగదు ప్రోత్సాహకాల వరకే పరిమితం కావటం క్రీడాభిమానులకు చేదు గుళిక.
ముందడుగు పడేనా? : 2014 ఆగస్టులో క్రీడా నగరి ప్రతిపాదన చేసిన సీఎం కేసీఆర్, అదే ఏడాది డిసెంబర్ 15న రాచకొండ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. 31,000 ఎకరాల సువిశాల రాచకొండ ప్రాంతం ప్రకృతి రమణీయ అందాలతో పాటు చారిత్రక కోటతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ క్రీడా నగరి నెలకొల్పుతామని సీఎం ప్రకటించారు. ఒలింపిక్ క్రీడలకు అన్నింటికి ఇక్కడ సకల సదుపాయాలు నెలకొల్పుతారు. స్పోర్ట్స్ మెడిసిన్, కోచ్ల శిక్షణకు సైతం ప్రత్యేక విభాగాలు ఇక్కడే ఏర్పాటు చేయాలనే కీలక ప్రతిపాదనలు తయారు చేశారు. స్పోర్ట్స్ సిటీతో పాటు సినిమా సిటీని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. కానీ ఇప్పటికీ అది ఆలోచన దశలోనే మూలుగుతున్నది. క్రీడా నగరి ప్రతిపాదనల పురోగతిపై క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదిస్తే, అసలు ఆ ఆలోచన ఉందా? అనే అనుమానం వ్యక్తం చేయటం గమనార్హం.
చరిత్ర విజేతలను మాత్రమే గుర్తుంచుకోవటంలో ఓ తర్కం ఉంది. కానీ ప్రభుత్వాలు సైతం విజేతలనే గుర్తిస్తే భవిష్యత్కు తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అదే పనిలో నిమగమయ్యాయి. భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయటం మానేసి, విజేతలకు బహుమానాలు ప్రకటించి ఆ ఘనత మాదేనని గర్వపడుతున్నారు. లండన్ ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తారని టాప్ అథ్లెట్లపై అధిక మొత్తంలో ఖర్చు చేశారు. కానీ వారిలో ఎక్కువ శాతం విజయాలు సాధించలేదు. రియో ఒలింపిక్స్లోనూ అదే పొరపాటు చేశారు. బ్యాడ్మింటన్లో సింధు, రెజ్లింగ్లో సాక్షి మాలిక్లకు ప్రభుత్వం తృతీయ శ్రేణి ప్రాధాన్యం సైతం ఇవ్వలేదు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్కూ పాత పొరపాట్లతోనే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయాలు సాధించిన, పతకాలు తెచ్చిన క్రీడాకారులపై దృష్టి పెడుతోంది. వర్థమాన క్రీడాకారులపై కనీసం పది శాతం పెట్టుబడికి సిద్ధపడటం లేదు. భారత క్రీడా రంగ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ (హాకీ లెజెండ్)ను రిటైర్మెంట్ అనంతరం విస్మరించిన ప్రభుత్వాలు, భవిష్యత్ ధ్యాన్చంద్ పట్ల ఆదిలోనే చిన్నచూపు చూస్తోంది. అందుకే పదేపదే అంతర్జాతీయ స్థాయిలో భారత్, జాతీయ స్థాయిలో తెలంగాణ పతకాల సాధనలో తీరన వేదన అనుభవిస్తున్నాయి. క్రీడా విధానంపై ఇకనైనా ప్రభుత్వాల తీరు మారుతుందా?.