Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తులోనూ సహకారం
- విజేతకు సీఎం సన్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలవడం ద్వారా పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడాపోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని సిఎం అన్నారు.
పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరినాథ్ బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. తనకు వచ్చిన మెడల్ను కేసీఆర్కు పివి సింధు చూపించారు. రెండు రాకెట్లను సీఎంకు బహుకరించారు. సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సీఎం సన్మానించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, పోలీస్ కమీషనర్లు అంజనీకుమార్, విసి సజ్జనార్, మహేష్భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్ తదితరులు పాల్గొన్నారు.
''పివి సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కరుగా నిలిచారు. ఇది మనందరికీ గర్వకారణం. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం కాదు. స్వతహాగా జాతీయ క్రీడాకారులైన రమణ దంపతులు తమ కూతురును గొప్పగా తీర్చిదిద్దారు. గోపీచంద్ చక్కగా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అంతర్జాతీయ విజేతలను తయారుచేసే వేదికగా హైదరాబాద్ మారుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలి. ఒలంపిక్స్కు వెళ్లాలి. భవిష్యత్తు టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
సింధు ఒలింపిక్ స్వర్ణంతో రాజ్భవన్కు రావాలి: గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఒలంపిక్ స్వర్ణంతో రాజ్భవన్ రావాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన సింధు, ఆమె కోచ్ గోపీచంద్, పారా షట్లర్ మానసిలను గవర్నర్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ నిజమైన కృషి, దక్షతకు సింధు నిదర్శనంగా నిలిచిందన్నారు. 2020 ఒలింపిక్స్లో స్వర్ణం పతకంతో ఆమె మళ్లీ రాజ్భవన్కు రావాలని నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పారా షట్లర్ మానసి జోషి ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక అని గవర్నర్ అన్నారు. ఆమె అందరికీ రోల్ మోడల్ అని కొనియాడారు.