Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్, పుజార విఫలం
- భారత్ తొలి ఇన్నింగ్స్ 72/2
- వెస్టిండీస్తో రెండో టెస్టు
కింగ్స్టన్ : ఆంటిగ్వాలో నిరాశపరిచిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (41 బ్యాటింగ్, 99 బంతుల్లో 5 ఫోర్లు) కింగ్స్టన్లో రాణిస్తున్నాడు. వరుసగా రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్కు వచ్చిన టీమ్ ఇండియా తొలి సెషన్లో మెరుగైన ప్రదర్శన చేసింది. మయాంక్ అగర్వాల్ రాణించటంతో లంచ్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 72/2తో కొనసాగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (5 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ అరంగ్రేట స్పిన్ ఆల్రౌండర్ రకీమ్ కార్న్వాల్ కెరీర్ను సూపర్గా మొదలెట్టాడు. భారత టెస్టు స్పెషలిస్ట్, స్పిన్ ఎదుర్కొవటంలో అత్యుత్తమ ఆటగాడు చతేశ్వర్ పుజారతో వికెట్ల ఖాతా తెరిచాడు.
రాహుల్, పుజార విఫలం : కింగ్స్టన్ పిచ్ పచ్చికతో కనిపించగా, టాస్ నెగ్గిన విండీస్ కెప్టెన్ జేసన్ హౌల్డర్ తొలుత బౌలింగ్కు మొగ్గుచూపాడు. తొలి గంటలో కరీబియన్ పేసర్లు గతి తప్పారు. దీంతో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ (13, 26 బంతుల్లో 2 ఫోర్లు) సులువుగా పరుగులు పిండుకున్నారు. కెప్టెన్ జేసన్ హౌల్డర్ బంతి అందుకున్న తర్వాత విండీస్ గాడిలో పడింది. కట్టుదిట్టమైన బంతులతో బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచారు. హౌల్డర్ బౌలింగ్లో కార్న్వాల్కు క్యాచ్ ఇచ్చిన కెఎల్ రాహుల్ తొలి వికెట్ రూపంలో పెవిలియన్కు చేరుకున్నాడు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజార (6) వైఫల్యం మూడో ఇన్నింగ్స్కు చేరుకుంది. తొలి టెస్టులో రెండు సార్లు నిరాశపరిచిన పుజార.. కింగ్స్టన్లో ఎదుర్కొన్న 25 బంతికే వికెట్ కోల్పోయాడు. అరంగ్రేట స్పిన్నర్ కార్న్వాల్కు వికెట్ సమర్పించుకున్నాడు. రాహుల్, పుజార వికెట్తో తొలి సెషన్లో విండీస్ పట్టు సాధించింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఐదు ఫోర్లతో మెరిశాడు. లంచ్ సమయానికి కెప్టెన్ కోహ్లితో కలిసి అజేయంగా 41 పరుగులతో నిలిచాడు.