Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 జట్టులో ధోని లేకపోవటంపై గంగూలీ
న్యూఢిల్లీ : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్కు దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిని ఎంపిక చేయకపోవటం పట్ల ఆశ్చర్యం ఏముందని? మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భవిష్యత్ ప్రణాళిక దిశగా టీమ్ ఇండియా మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ సరైన దిశగా పయనిస్తోందని దాదా అభిప్రాయపడ్డాడు. టీ20 జట్టుకు ఎం.ఎస్ ధోనిని ఎంపిక చేయకపోవటం ఆశ్చర్యానికి గురి చేసిందా? అని అడిగిన ప్రశ్నకు గంగూలీ బదులిచ్చాడు. ' లేదు, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు జట్టులో ధోని ఉంటాడని నేను అనుకోలేదు. వెస్టిండీస్తో సిరీస్ను గమనిస్తే, రిషబ్ పంత్కు జట్టు మేనేజ్మెంట్ అవకాశాలు ఇవ్వటానికి సుముఖంగా ఉందని తెలుస్తోంది. పంత్తోనే కొనసాగాలని వారు భావిస్తున్నట్టు ఉన్నారు. అదే మంచి నిర్ణయం. ఎందుకంటే ఎం.ఎస్ కెరీర్ తొలినాళ్లలోనూ అదే జరిగింది' అని గంగూలీ అన్నాడు. ధోని జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు గంగూలీ భారత కెప్టెన్ అనే సంగతి తెలిసిందే. కెరీర్ ముగించటంపై చర్చ ప్రతి దిగ్గజం విషయంలో జరుగుతున్నదే. మారడోనా, పిట్ సంప్రాస్, సచిన్ టెండూల్కర్.. ఇప్పుడు ఎం.ఎస్ ధోని. కెరీర్లో ఓ దశకు చేరుకున్న తర్వాత ఈ పరిస్థితిని చవిచూడాల్సిందే. ధోని విషయంలో కెప్టెన్ కోహ్లి కీలకం అవుతాడు. అతడితో సమాచార మార్పిడికి అదే మూలం. మహి నుంచి జట్టు ఏం కోరుకుంటుందో కోహ్లి చెప్పాలి. ధోని జట్టులో ఉండాలని కోహ్లి, కోచ్ భావిస్తే అతడు వస్తాడు. యువ ఆటగాళ్లతోనే సాగాలని భావిస్తే, మహికి మరో మార్గం లేదని గంగూలీ అన్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను దిగ్గజం ధోనితో పోల్చటం సరికాదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ' ఆంటిగ్వా టెస్టులో విఫలం కాగానే పంత్ను తొలగించాలనే వార్తలను పత్రికల్లో చదివాను. ఆంటిగ్వా టెస్టుకు ముందు ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించాడు. అంతకముందు మ్యాచుల్లో 90 ప్లస్ ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ప్రత్యేక ఆటగాడే అయినా, ధోనితో పోల్చటం సరికాదు. మరో 3-4 ఏండ్లలోనూ ధోని స్థాయిని పంత్ అందుకోలేడు. 15 ఏండ్ల నిరంతర శ్రమ తర్వాత ఎం.ఎస్ ధోని దిగ్గజం అయ్యాడు. భారత క్రికెట్లో ధోనిది ప్రత్యేక డీఎన్ఏ' అని దాదా పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకున్న వృద్దిమాన్ సాహా అవకాశం ఎదురు చూడాలి. ఇక్కడ అనుభవం, వయసు ప్రస్తావన లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.