Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోటెస్ట్లో 257 పరుగులతో భారత్ ఘన విజయం
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హనుమ విహారి
కింగ్స్టన్(జమైకా)
కరేబియన్ టూర్ను టీమిండియా దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. టీ20, వన్డే సిరీస్లను ఇప్పటికే గెల్చుకున్న టీమిండియా టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేసి సగర్వంగా భారత్కు తిరుగు పయనమైంది. రెండో, ఆఖరిటెస్ట్లో విండీస్ను 257 పరుగుల భారీ తేడాతో ఓడించి 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. సోమవారం 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్(50) టాప్ స్కోరర్గా నిలవగా... బ్లాక్వుడ్(38), హోల్డర్(39), బ్రేవో(23) ఫర్వాలేదనిపించారు. మహ్మద్ షమి, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం గాదె హనుమ విహారి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. తొలి టెస్ట్ను 318 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ధోని రికార్డును దాటేసిన పంత్
రెండోటెస్ట్ మ్యాచ్లో యువ క్రికెట్ రిషబ్ పంత్ ఓ రికార్డును నమోదు చేశాడు. టెస్టుల్లో వేగంగా 50మంది ఆటగాళ్లను ఔట్ చేసిన భారత వికెట్ కీపర్గా పంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ కేవలం 11 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇషాంత్ శర్మ బౌలింగ్లో బ్రాత్వైట్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను పంత్ అందుకున్నాడు.
విహారిపై ప్రశంసలు
రెండోటెస్టులో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన తెలుగు యువ క్రికెటర్ హనుమ విహారిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. 'ఈ మ్యాచ్లో హనుమ విహారి స్టాండ్ అవుట్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. తను అంకితభావం గల ఆటగాడు. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్లోనూ టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. తను క్రీజులో ఉన్నపుడు డ్రెస్సింగ్లో అంతా నిశ్శబ్ధంగా ఉండి తన ఆటపై దృష్టి సారిస్తారు. తను సహజంగానే మనసు పెట్టి ఆడతాడు. జట్టు విజయం కోసం పరితపిస్తాడు. తనకు ఎంతో భవిష్యత్తు ఉంది. జట్టులోకి ఎంపిక చేసిన నిర్ణయానికి ఈరోజు తన ఆటతో సమాధానం చెప్పాడు' అని విహారిని ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా రోహిత్ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న కోహ్లి నిర్ణయానికి సమర్థింపుగా.. సెంచరీ, అర్ధసెంచరీతో విహారీ సత్తా చాటాడు. తద్వారా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్న సంగతి తెలిసిందే.
సమిష్టి కృషితోనే : కోహ్లి
విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ 'విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా ఉండటం ఆనందంగా ఉంది. అయితే ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా షమీ, ఇషాంత్, జడేజా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెట్టారు. నిజానికి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మన పేరుకు ముందు 'సీ' అనే కొత్త అక్షరం చేరుతుందే గానీ పెద్దగా మార్పు ఏమీ ఉండదు. జట్టు రాణించకపోతే కెప్టెన్ ఒక్కడే విజయాలు సాధించ లేడు కదా. మరిన్ని విజయాలు సాధించడమే మా ముందున్న లక్ష్యం' అని వ్యాఖ్యానించాడు. రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 'గోల్డెన్ డక్' అయిన సంగతి తెలిసిందే. జమైకాలో వెస్టిండీస్తో జరిగిన ఆఖరి టెస్ట్లో 257 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కోహ్లీ సేన క్లీన్స్వీప్ చేసింది. అంతేగాకుండా విండీస్తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో కోహ్లి అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్గా కొత్త చరిత్ర సృష్టించాడు.