Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు ఫార్మాట్లలోనూ క్లీన్స్వీప్
నవతెలంగాణ క్రీడా విభాగం
కోహ్లీ సేన కరేబియన్ టూర్ను క్లీన్స్వీప్లతో ముగించింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లను ఓటమి చవిచూడకుండా ఘనంగా ముగించుకొని తిరుగు పయనమైంది. ఆగస్టు 3 ప్రారంభమైన ఈ పర్యటన సెప్టెంబర్3తో ముగిసింది. ఈ పర్యటనకు బయల్దేరేముందు విండీస్తో తలపడే భారతజట్టును బిసిసిఐ మూడు ఫార్మాట్లకు విడి విడిగా ఆటగాళ్లను ఎంపిక చేసి పంపి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఆరంభంలో జరిగిన మూడు టీ20ల సిరీస్ను 3-0తో చేజిక్కించుకున్న టీమిండియా... ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ను 2-0తో గెల్చుకుంది. ఆగస్టు 8న జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఈ సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసినట్లే... ఆఖరిగా జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా 2-0తో చేజిక్కించుకుంది. దీంతో కరేబియన్ పర్యటనను టీమిండియా దిగ్విజయంగా ముగించిందని చెప్పుకోవచ్చు.
టీ20లతో యువ ఆటగాళ్లు వెలుగులోకి..
మూడు ఫార్మాట్లకు విడి విడిగా ఆటగాళ్లను ఎంపిక చేసిన బిసిసిఐ మూడు ఫార్మాట్లలో కొందరు మాత్రమే ఆటగాళ్లు పాల్గొన్నారు. టీ20లకు యువ ఆటగాళ్లను ఎంపిక చేయడం ద్వారా వారి సత్తా ఏమిటో వెలుగులోనికి వచ్చిందని చెప్పవచ్చు. టీ20ల్లో నవ్దీప్ సైనీ 150 కిలోమీటర్లకంటే వేగంగా బంతులను విసిరి విండీస్ ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. అంతేగాక వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్ వంటి యువ ఆటగాళ్లు తామేమిటో ఈ సిరీస్లో నిరూపించుకున్నారు. కృనాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు ఎంపికవ్వగా... దీపక్ చాహర్, నవ్దీప్ సైనీలకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.
వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ సత్తా...
ఇక వన్డేల ద్వారా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వెలుగులోనికి వచ్చాడు. తొలి వన్డే వర్షార్పణమైన నేపథ్యంలో రెండు, మూడు వన్డేల్లో అర్ధసెంచరీలతో కదం తొక్కాడు. జట్టు కష్టాల్లో ఉన్న దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి జతకట్టి మరో వికెట్ పడకుండా భారీస్కోర్ సాధనకు దోహదపడ్డాడు. తొలి వన్డేలో 71, రెండో వన్డేలో 65 పరుగులు చేసి తాను వన్డేలకు సరిపోతానని రుజువు చేసుకున్నాడు. ఈ రెండు వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు బాది మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.
టెస్టుల్లో వీర 'విహారి'
టెస్టు సిరీస్లో మన కాకినాడ కుర్రాడు హనుమ విహారి మరోసారి మెరిశాడు. నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 289 (32, 93, 111, 53) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. చాలాకాలం తర్వాత టెస్టుల్లో చోటు దక్కించుకున్న అజింక్యా రహానే 271(81, 102, 24, 64) పరుగులతో రెండోస్థానంలో నిలిచాడు. వీరిద్దరూ టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకు ఎంపికయ్యారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్పై హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. ఇక మయాంక్ అగర్వాల్ తొలిటెస్ట్లో నిరాశపర్చినా రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
దీంతో మూడు ఫార్మాట్లకు ఒక్కో జట్టును పంపి బిసిసిఐ చేసిన కొత్త ప్రయోగం ఫలించిందని చెప్పవచ్చు. కానీ భారతజట్టు ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్లో 3,631 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... వెస్టిండీస్ జట్టు 2,381 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. కేవలం 8వ స్థానంలో ఉన్న విండీస్పై గెలిచి మీసాలు మెలేస్తే సరిపోదు. బలమైన జట్లతో విదేశీ గడ్డపై ఆడి గెలిస్తేనే వీరి ప్రతిభ వెలుగులోనికి వచ్చే అవకాశముంది. అంతేగాక ప్రతిభగల ఆటగాళ్లు వెలుగులోనికి రావడం ఖాయం.