Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టు ఎంపికపై కుంబ్లే
- సరైన వీడ్కోలుకు ధోని అర్హుడని వ్యాఖ్య
బెంగళూర్ : కరీబియన్ పర్యటనలో టీమ్ ఇండియా వరుసగా రెండో టెస్టు సిరీస్ సాధించింది. ఆంటిగ్వా, జమైకా టెస్టుల్లో కోహ్లిసేన తిరుగులేని విజయాలు సాధించింది. అయినా, ఓ అంశంపై జట్టు మేనేజ్మెంట్ ఆలోచన తీరుపై పదేపదే విమర్శలు వినిపించాయి. టీమ్ ఇండియా ట్రంప్ కార్డ్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవటం విమర్శలకు చోటిచ్చింది. అశ్విన్ స్థానంలో తుది జట్టుకు ఎంపికైన రవీంద్ర జడేజా మెరుగైన ప్రదర్శన చేసినా, గత కరీబియన్ టూర్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన అశ్విన్ను పక్కనపెట్టడం మాజీలకు రుచించ లేదు. ఈ అంశంపై మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయం వెల్లడించాడు. భారత జట్టులో అశ్వినే ఇప్పటికీ అత్యుత్తమ స్పిన్నర్ అని కితాబిచ్చాడు. ' భారత్కు అశ్విన్ ఇప్పటికీ అత్యుత్తమ స్పిన్నర్. గాయాల కారణంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని సందర్భాలు ఉన్నాయి. కానీ జట్టులో అశ్విన్ నం.1 స్పిన్నర్. తుది జట్టులో అతడు భాగం కావాల్సింది. అతడి కోసం మార్గం సుగమం చేయాల్సింది. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాలని నేను బలంగా విశ్వసిస్తాను. అశ్విన్, జడేజా మంచి స్పిన్తో పాటు బ్యాట్తో సమర్థవంతమైన ఆటగాళ్లు. టెస్టుల్లో అశ్విన్ నాలుగు సెంచరీలు చేశాడు. రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతున్నాడు.
ఈ ఇద్దరూ కలిసి బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చెమట లు పడతాయి' అని కుంబ్లే అన్నాడు. జడేజా మెరుగైన బ్యాటింగ్ సామర్థ్యం, చురుకైన ఫీల్డింగ్ కదలికలు అతడిని తుది జట్టులో నిలిపాయని చీఫ్ కోచ్ రవిశాస్త్రి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని వీడ్కోలు ఎప్పుడు పలకాలనేది పూర్తిగా అతడి వ్యక్తిగత అంశం. కానీ అతడిని 2020 టీ20 ప్రపంచకప్ వరకూ కొనసాగించాలని సెలక్టర్లు భావిస్తే, అన్ని మ్యాచుల్లోనూ అవకాశం ఇవ్వాలి. ఇతర ఆలోచన ఏమైనా ఉంటే, మహితో మాట్లాడాలి. ఘనమైన వీడ్కోలుకు ఎం.ఎస్ ధోని అర్హుడు అని కుంబ్లే పేర్కొన్నాడు.