Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా చాంపియన్ ఖతార్కు ఊహించని చుక్కెదురు
- ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ను డ్రా చేసుకున్న భారత్
- ఆధునిక ఫుట్బాల్లో భారత్కు ఇదే అత్యుత్తమం
మంగళవారం రాత్రి వరకూ ప్రతి ఆసియా చాంపియన్కు భారత్కు గోల్ కోల్పోయింది. ఆసియా దిగ్గజంపై గోల్ కొట్టడం అటుంచి, ప్రత్యర్థి ఎదురుదాడికి ఎదురొడ్డి గోల్పోస్ట్ను కాపాడుకున్న సందర్భమే చరిత్రలో కనిపించదు. ఫుట్బాల్లో ఆసియా సింహనాదం జపాన్ను చిత్తు చేసి, ఈ ఏడాది ఎదురొచ్చిన ప్రతీ జట్టుపైనా తిరుగులేని విజయాలు సాధించింది ఖతార్. సొంతగడ్డపై ఆడుతున్నవేళ ఖతార్ మరింత ప్రమాదకారి.
ఈ పరిస్థితుల్లో ఫిఫా ప్రపంచకప్ 2022 క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఖతార్ను భారత్ను ఎదుర్కొనగా, ఎవరికీ మెన్ ఇన్ బ్లూపై నమ్మకం లేదు. ఇటీవల వరుసగా మెరుగైన ప్రదర్శన చేస్తున్న సాకర్ జట్టు.. దోహాలో అద్భుత ప్రదర్శనే కనబర్చింది. గోల్పోస్ట్ ముందు గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సద్దూ గోడ కట్టేశాడు. ఖతార్ చేసిన 22 గోల్ ప్రయత్నాలను నీరుగార్చాడు. ఆధునిక ఫుట్బాల్లో భారత్కు అత్యుత్తమ ఫలితం అందించాడు. ఆసియా అగ్రజట్టు ఖతార్తో 0-0తో డ్రా చేసుకున్న టీమ్ ఇండియా, ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రేసులో అవకాశాలు మెరుగు పర్చుకున్నది.
దోహా (ఖతార్)
భారత ఫుట్బాల్ చరిత్రలో 1950-60 కాలాన్ని స్వర్ణ యుగంగా పరిగణిస్తారు. 1951 ఆసియా క్రీడల్లో ఇరాన్ను ఓడించిన భారత్త స్వర్ణ పతకం సాధించింది. 1962లో దక్షిణాఫ్రికాపై విజయంతో రెండోసారి ఆసియా క్రీడల విజేతగా అవతరించింది. రెండేండ్ల తర్వాత జరిగిన ఆసియా కప్ ఫైనల్లో రన్నరప్గా నిలిచింది. 16 దేశాలు పాల్గొనాల్సిన ఆ టోర్నీలో ఏకంగా 11 జట్టు పోటీని బహిష్కరించినా, టోర్నీలో టీమ్ ఇండియా ప్రదర్శనను తక్కువ చేసే సాహాసం ఎవ్వరూ చేయలేదు. భారత ఆధునిక ఫుట్బాల్ శిల్పి, మార్గనిర్దేశక నిర్మాత సయ్యద్ అబ్దుల్ రహీం టీమ్ ఇండియా కోచ్, మేనేజర్గా ఉన్న సమయంలో మెన్ ఇన్ బ్లూ విజయాల బాటలో దూసుకెళ్లింది. సయ్యద్ అబ్దుల్ రహీం సమయంలో భారత్కు ఫుట్బాల్ ప్రధాన కార్యాలయంగా హైదరాబాద్ వెలుగొందింది. దిగ్గజ సయ్యద్ అబ్దుల్ రహీం నిష్క్రమణతో హైదరాబాద్ ఫుట్బాల్ వెలుగులతో పాటు టీమ్ ఇండియా సాకర్ కాంతిలోనూ చీకట్లు కమ్ముకున్నాయి. మంగళవారం అర్థరాత్రి ఖతార్తో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2022 క్వాలిఫయర్ మ్యాచ్ను భారత్ 0-0తో డ్రా చేసుకుంది. ఆసియా సాకర్ అగ్రజట్టు జపాన్ను మట్టికరిపించి ఆసియా ఖండం చాంపియన్గా అవతరించిన ఖతార్.. సొంతగడ్డపై ఫిఫా ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వబోతున్న వేళ ప్రమాదకర జట్టుగా రూపొందింది. ఓ ఆసియా చాంపియన్తో మ్యాచ్ను డ్రా చేసుకోవటం భారత్కు ఇదే తొలిసారి. 90 నిమిషాల పూర్తి ఆటలో ఖతార్ ఆధిపత్యం చెలాయించినా, టీమ్ ఇండియా పోరాట తత్వంలో మార్పు రాలేదు. బలమైన జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వని టీమ్ ఇండియా, సయ్యద్ అబ్దుల్ రహీం స్వర్ణం యుగం తర్వాత సాధించిన అత్యుత్తమ విజయంగా చెప్పవచ్చు.
అసమాన ప్రదర్శన : 2019 ఆరంభం నుంచీ ఖతార్ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ఆసియా చాంపియన్ కీరిటం దక్కించుకున్న ఖతార్ సొంతగడ్డపై 2022 ఫిఫా ప్రపంచకప్లో టైటిల్ పోటీదారుగా నిలిచేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. జపాన్పై 3-1తో తిరుగులేని విజయం సాధించి, ఆసియాలో నేను నం.1 అని ఖతార్ చాటి చెప్పింది. ఆసియా కప్లో ఆడిన ఏడు మ్యాచుల్లో ఖతార్ 19 గోల్స్ కొట్టగా.. కేవలం ఒక్కసారే తన గోల్పోస్ట్లోకి బంతిని వెళ్లనిచ్చింది. ఈ ఏడాది వేసవిలో జరిగిన కోపా అమెరికా కప్లో జపాన్ తర్వాత ప్రాతినిథ్యం వహించిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆ టోర్నీలోనూ బలమైన పరాగ్వేతో 0-2తో వెనుకంజలో నిలిచినా ఆట పూర్తయ్యేసరికి 2-2తో సమవుజ్జీగా నిలిచింది. కొలంబియా (0-1), అర్జెంటీనా (0-2)లపైనా ఖతార్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఇటీవల అఫ్ఘనిస్థాన్ను 6-0తో చిత్తు చిత్తుగా ఓడించింది. ప్రత్యేకించి సొంతగడ్డపై ఆడుతున్న సమయంలో ఖతార్ మరింత ప్రమాదకారి. ఖతార్ గడ్డపై భారత్ తొలిసారి ఓటమి చవిచూడకుండా తప్పించుంది. ఈ అర్థ శతాబ్డ కాలంలో 2001లో యు.ఏ.ఈపై సాధించిన 1-0 విజయమే భారత ఫుట్బాల్లో మెరుగైన ప్రదర్శన. బెంగళూర్లో జరిగిన మ్యాచ్లో అప్పుడు సొంత అభిమానుల దన్ను తోడైంది. ఇప్పుడు ప్రత్యర్థి గడ్డపై, బలమైన జట్టుపై 0-0 డ్రా భారత ఫుట్బాల్ చరిత్రలోనే మెరుగైన విజయంగా పరిగణిస్తున్నారు.
ప్రమాదకరమైన, బలమైన ప్రత్యర్థి ఖతార్పై భారత్ డ్రాను ఎవ్వరూ ఊహించలేదు. నిజానికి మ్యాచ్లో ఖతార్ అత్యధిక భాగం నియంత్రణ సాధించింది. భారత గోల్పోస్ట్పై ఏకంగా 22 సార్లు భీకర దాడులు చేసింది. హెడర్లతో ఖతార్ ఎదురుదాడి చేసింది. కొన్ని షాట్లు క్రాస్బార్కు సైతం తగిలాయి. ప్రత్యర్థి ఇంత భీకర స్థాయిలో దాడులు చేసినా, భారత్ కేవలం రెండు సార్లు మాత్రమే ఖతార్ గోల్పోస్ట్పైకి దండెత్తింది. ఎదురుదాడిలో ఆకట్టుకోకపోయినా, డిఫెన్స్లో భారత్ సంతృప్తికర ప్రదర్శన చేసింది. గోల్ కీపర్ గుర్కీరత్ సింగ్ సిద్దూ అసమాన నైపుణ్యం భారత ఫుట్బాల్ను గర్వపడేలా చేసింది. ఖతార్ దండయాత్రను ముందుండి నిలువరించిన గుర్కీరత్ అసమాన ప్రదర్శన, భారత జట్టులో ఎనలేని స్ఫూర్తి నింపింది. 90 నిమిషాల ఆటలో ఖతార్ నామస్మరణతో ఊగిపోయిన జసిమ్ బిన్ హమద్ స్టేడియం, ఆట ముగిసిన అనంతరం టీమ్ ఇండియా నామస్మరణతో పులకించింది. భారత జట్టు బృందంగా స్టేడియం కలియతిరిగి అభిమానులకు అభివాదాలు చేశారు. సూపర్ హీరో గుర్కీరత్ సింగ్పై అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 2022 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్లో ఖతార్ మ్యాచ్ను డ్రా చేసుకున్న టీమ్ ఇండియా విలువైన ఒక పాయింట్ సాధించింది. క్వాలిఫయర్లో మిగిలిన మ్యాచుల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేయగల్గితే.. తొలిసారి విశ్వపోరుకు సిద్ధమయ్యే స్వర్ణావకాశం భారత్ ముందుంది.
12వ ఆటగాడు అభిమానులే
దోహా : 2022 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఖతార్ తిరుగులేని ప్రదర్శన చేసింది. అభిమానుల దృష్టిని, ప్రపంచ సాకర్ దృష్టిని ఓసారి తనవైపుకు తిప్పుకున్నది. 2022 ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య దేశం, ఆసియా చాంపియన్ ఖతార్ను ఈ స్థాయిలో నిలువరించిన జట్టు ఏడాదిలో భారత్ మాత్రమే. క్వాలిఫయింగ్ పోరులో ఖతార్కు మూడు పాయింట్లు లాంఛనమే అనుకున్న అంచనాలను తలకిందులు చేసిన భారత్, విలువైన ఒక పాయింట్ ఖాతాలో వేసుకుంది. ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ రౌండ్లో తన తర్వాతి మ్యాచ్ను టీమ్ ఇండియా సొంతగడ్డపై ఆడనుంది. అక్టోబర్ 15న కోల్కతలో జరుగనున్న కీలక మ్యాచ్లో పొరుగు దేశం బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. చారిత్రక ప్రదర్శన చేసిన ఉత్సాహంలో ఉన్న టీమ్ ఇండియా, సొంతగడ్డ మ్యాచ్లో మూడు పాయింట్లు సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో కోల్కత మ్యాచ్కు అభిమానులతో స్టేడియం పూర్తిగా నిండిపోవాలని భారత ఫుట్బాల్ జట్టు కోచ్ ఇగోర్ స్టిమాక్ పిలుపునిచ్చాడు. 'ఖతార్పై మా ప్రదర్శన తర్వాతి మ్యాచ్లో అభిమానులకు ఆహ్వానం. ఫుట్బాల్ పట్ల కోల్కత ఫ్యాషన్పై ఎంతో విన్నాను. వైబికె స్టేడియం పూర్తిగా అభిమానులో నిండితే సిటీ ఆప్ జారు అభిమానాన్ని స్వయంగా చూడాలనుకుంటున్నా. అభిమానులు జట్టుకు 12వ ఆటగాడు కావాలి. తర్వాతి మ్యాచ్లో భారత్ మూడు పాయింట్లు సాధించాలని కోరుకోవాలి' అని ఇగోర్ పేర్కొన్నాడు.