Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఫారసు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : ఆరు సార్లు ప్రపంచ చాంపియన్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పేరును రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్కు సిపారసు చేసింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. భారత గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ పౌర పురస్కారాలను ప్రకటిస్తుంది. అందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు అర్హులైన వారి పేర్లను సిఫారసు చేస్తాయి. ఈ సారి క్రీడా మంత్రిత్వ శాఖ ఏడుగురు క్రీడాకారిణుల పేర్లను సిఫారసు చేసింది. బ్యాడ్మింటన్ బాహుబలి, వరల్డ్ చాంపియన్ పి.వి సింధును పద్మ భూషణ్కు సిఫారసు చేసింది. క్రీడా మంత్రిత్వ శాఖ పౌర పురస్కారాలకు మహిళా అథ్లెట్లను మాత్రమే సిఫారసు చేయటం ఇదే తొలిసారి. 2015లో పద్మ శ్రీ పొందిన సింధుకు 2017 అవార్డుల కమిటీ పద్మ భూషణ్ నిరాకరించింది. మేరీకోమ్ 2006లో పద్మ శ్రీ, 2013లో పద్మ భూషణ్ పురస్కారాలను అందుకుంది. పద్మ విభూషణ్ పురస్కారం వరిస్తే, చెస్ మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ (2007), దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (2008), పర్వతారోహణకులు సర్ ఎడ్మండ్ హిల్లరీ తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న అథ్లెట్గా మేరీకోమ్ నిలువనుంది. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ మెరుపు తార మానిక బత్ర, మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా షిమ్రోర్, పర్వాతారోహణ కవల సోదరీమణులు తషీ, మాలిక్ల పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందని సంబంధిత వర్గాల వెల్లడించాయి.