Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందజేసిన సినీ నటుడు నాగార్జున
నవతెలంగాణ, హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లో స్వర్ణం సాధించిన ఏకైక భారత షట్లర్గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పి.వి సింధును మరో ఖరీదైన కారు వరించింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు కార్లను బహుకరిస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు వి. చాముండేశ్వరినాథ్, వరల్డ్ చాంపియన్ సింధుకు బిఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో శనివారం జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతులు మీదుగా సింధు కారు తాళాలను అందుకుంది. ఈ కారుతో చాముండేశ్వరినాథ్ క్రీడాకారులకు బహూకరించిన కార్ల సంఖ్య 22కు చేరింది. ' చాముండి నాకు తొలి కారు బహుమతిగా ఇచ్చినప్పుడు, అందరూ ఏం సాధించిందని ప్రశ్నించారు. ఓపిక పట్టండి, ఆమె ఏం సాధిస్తుందో చూడండి అని చాముండి అన్నారు. తొలి కారు అందుకున్న నాలుగేండ్లలోనే రియో ఒలింపిక్స్లో సిల్వర్ సాధించాను. ఎవర్గ్రీన్ స్టార్ నాగార్జున చేతుల మీదుగా కారు అందుకోవటం సంతోషంగా ఉంది. ఒలింపిక్స్ స్వర్ణం సాధనకు శాయశక్తులా కృషి చేస్తాను' అని సింధు పేర్కొంది. చాంపియన్ అథ్లెట్ పి.వి సింధును తీర్చిదిద్దిన జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, దేశానికి చాంపియన్ను అందించిన తల్లిదండ్రులు పి.వి రమణ, విజయ దంపతులకు నాగార్జున అభినందనలు తెలిపారు.