Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేత పంకజ్
- కెరీర్లో 22వ టైటిల్ కైవసంమాన్డలె
(మయన్మార్): భారత్కు చెందిన 34ఏండ్ల సీనియర్ స్నూకర్ ఆటగాడు పంకజ్ అద్వాని కెరీర్లో 22వ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రపంచ బ్రిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 6-2 ఫ్రేముల తేడాతో స్థానిక ఆటగాడు నే-తై-ఓను చిత్తుచేశాడు. ఫైనల్లో పంకజ్ 150-4, 151-66, 150-50, 7-150, 151-69, 150-0, 133-150, 150-75 తేడాతో మయన్మార్ ఆటగాడిపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఆరేండ్లలో పంకజ్ ఐదో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నట్టయ్యింది. గతేడాది ఈ టోర్నీ ఫైనల్లో కూడా వీరిద్దరే తలపడగా అప్పుడూ పంకజ్ టైటిల్ను గెలుపొందడం విశేషం. ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలోనే వరుసగా మూడు ఫ్రేమ్లను గెల్చుకొని పంకజ్ మయన్మార్ ఆటగాడిపై ఒత్తిడి పెంచాడు. నాలుగోఫ్రేమ్ను ప్రత్యర్థికి కోల్పోయినప్పటికీ ఐదు, ఆరు ఫ్రేమ్లలో మళ్లీ పుంజుకున్నాడు. ఆరో ఫ్రేమ్లో అయితే పంకజ్ ప్రత్యర్ధికి ఒక్క పాయింట్ కూడా దక్కకుండా ఆ ఫ్రేమ్ను ముగించడం విశేషం. ఆ తర్వాత 7వ ఫ్రేమ్ను కోల్పోయినా... 8వ ఫ్రేమ్ను తన ఖాతాలో వేసుకొని మ్యాచ్ను ముగించాడు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పంకజ్ శనివారం జరిగిన సెమీఫైనల్ పోటీలో ఇంగ్లండ్కు చెందిన మైక్ రసెల్పై 5-2 ఫ్రేమ్ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.