Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుకీల శైలిపై ఏసీయూ చీఫ్
న్యూఢిల్లీ : తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్) సహా ఓ మహిళా క్రికెటర్ను బుకీలు సంప్రదించటంతో భారత క్రికెట్ వర్గాల్లో మరోసారి ఫిక్సింగ్ అలజడి మొదలైంది. జెంటిల్మెన్ గేమ్ ఇప్పుడు ఫిక్సింగ్ భూతం నీడలో నిలిచిందా? అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. భారత స్టార్ క్రికెటర్లతోనూ బుకీలు సంప్రదింపులు చేయగలరా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్, రాజస్థాన్ మాజీ డీజీపీ అజిత్ సింగ్ షేకావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ క్రికెటర్లు ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లిలతో సంప్రదింపులకు బుకీలు సమయం వృథా చేసుకోరని, వారితో ఫిక్సింగ్ చేయలేమనే విషయం బుకీలకు తెలుసని వ్యాఖ్యానించాడు. ' వ్యక్తిగతంగా నా అభిప్రాయం అడిగితే, ఓ స్టార్ క్రికెటర్ ఫిక్సింగ్తో సంపాదించే దాని కంటే కోల్పోయేదే ఎక్కువ. ధోని, కోహ్లి స్థాయి క్రికెటర్లను ఇందులో ఉన్నారని ఊహించుకోండి, అవి కేవలం డబ్బుతోనే ముడిపడిన అంశం కాదు. వెలకట్టలేని ప్రతిష్టకు సంబంధించిన అంశం. చిన్న విషయాలకు స్టార్ క్రికెటర్లు కెరీర్ అసాంతం కష్టపడి సాధించుకున్న గౌరవాన్ని, ప్రతిష్టను పణంగా పెట్టలేరు. ప్రకటనలు, ప్రచారకర్తలుగా వారికి అంత మొత్తంలో సొమ్ము దక్కుతుందంటే అందుకు కారణం వారి క్లీన్ ఇమేజ్, స్టార్ పవర్. బెట్టింగ్తో వారి సంపాదనలో ఒక్క శాతం పైసలు కూడా రావు' అని అజిత్ అన్నారు. బుకీలు ఎక్కువగా యువ క్రికెటర్లపై, అన్ సక్సెస్ఫుల్ ఆటగాళ్లపై వల పన్నుతారు. డబ్బు కోసమే అని చెప్పలేం, కొన్నిసార్లు యువ ఆటగాళ్లు ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోనూ ఫిక్సింగ్కు అంగీకరిస్తారు. భారత క్రికెట్లో ఫిక్సింగ్ చేయలేని పరిస్థితి వచ్చినందుకే, ఇప్పుడు వారు సొంతంగా లీగ్లు పెట్టుకుంటున్నారు. ఇతర లీగ్ల్లో బుకీలు ఎక్కువగా భారతీయ నేపథ్యం కలిగినవారే ఉన్నారు. ఇక్కడ ఫిక్సింగ్ పరిస్థితులు లేకనే, వారు వలస వెళ్లిపోతున్నారు. ఇది బీసీసీఐ సాధించిన విజయమేనని అజిత్ సింగ్ అన్నారు.