Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లో అనూహ్య ఓటమి
- సింధు, కశ్యప్, సాయిప్రణీత్ ముందంజ
- చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ (చైనా)
ఐదేండ్ల క్రితం ఇక్కడ విజయంతో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో చైనా షట్లర్ల ఆధిపత్యానికి అధికారికంగా చెక్ పెట్టిన సైనా నెహ్వాల్.. తాజాగా అక్కడే తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఇండోనేషియా ఓపెన్ విజయంతో సీజన్ను మెరుగ్గా మొదలెట్టిన సైనా నెహ్వాల్.. వరుసగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది. చైనా ఓపెన్లో పుంజుకునే అవకాశం కనిపించినా వరల్డ్ నం.18 చేతిలో తొలి రౌండ్లోనే భంగపడింది. థారులాండ్ షట్లర్ బుసానన్ చేతిలో 10-21, 17-21తో వరుస గేముల్లో సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. ప్రపంచ చాంపియన్, వరల్డ్ నం.5 పి.వి సింధు చైనా ఓపెన్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సింధు సులువైన విజయం నమోదు చేసింది. మాజీ ఒలింపిక్ చాంప్ లీ జురేరు (చైనా)పై 21-18, 21-12తో 29 నిమిషాల్లోనే లాంఛనం ముగించింది. పురుషుల సింగిల్స్లో బి. సాయిప్రణీత్ ముందంజ వేశాడు. ఇండోనేషియా షట్లర్ సుప్పన్యుపై 21-19, 21-23, 21-14తో గంటన్నర పోరాటంలో పైచేయి సాధించాడు. సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ 21-12, 21-15తో బ్రిస్ (ఫ్రాన్స్)పై విజయంతో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. నేడు రెండో రౌండ్లో థారులాండ్ షట్లర్ పోర్నపవీ చొచువింగ్తో పి.వి సింధు తలపడనుంది. సాయిప్రణీత్కు చైనా షట్లర్ లు జు సవాల్ విసరనున్నాడు. పారుపల్లి కశ్యప్ తర్వాతి మ్యాచ్లో ఏడో సీడ్ ఆంటోని (ఇండోనేషియా)తో తలపడనున్నాడు.
మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ 21-13, 11-8తో ముందంజలో కొనసాగుతున్న వేళ చైనీస్ తైపీ ప్రత్యర్థి జోడీ పోటీ నుంచి తప్పుకుంది. అశ్విని, సిక్కి రెండో రౌండ్కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డి 12-21, 21-23తో పరాజయం పాలయ్యారు. మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 15-21, 15-21తో తొలి రౌండ్లోనే నిరాశపరిచారు.