Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో ఓడిన బజరంగ్, రవికుమార్
- నేడు కాంస్యం కోసం సమరం
- ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్
నూర్ సుల్తాన్ (కజకిస్థాన్) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో గురువారం భారత్కు చేదు, తీపి కలయిక పలకరించింది. వరల్డ్ నం.1 బజరంగ్ పూనియా 65 కేజీల పురుషుల విభాగంలో పసిడి ఫేవరెట్గా బరిలోకి దిగినా, సెమీఫైనల్లోనే పరాజయం పాలయ్యాడు. కెరీర్ సూపర్ ఫామ్లో ఉన్న బజరంగ్ పూనియా ఈ సీజన్లో బరిలోకి దిగిన నాలుగు టోర్నీల్లోనూ పసిడి పతకాలు పట్టుకొచ్చాడు. నూర్ సుల్తాన్లోనూ పసిడి లక్ష్యంతోనే పట్టు పట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నియజ్బెకోవ్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూశాడు. సెమీ సమరంలో 2-7తో వెనుకంజలో నిలిచిన పూనియా 9-9తో సమవుజ్జీగా నిలిచినా ఫైనల్స్కు చేరుకోలేకపోయాడు. నేడు జరిగే కాంస్య పతక పోటీలో బజరంగ్ పోటీపడనున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్స్లో ఇప్పటికే రెండు పతకాలు సాధించిన పూనియా, ఈ ఏడాది పసిడిపై కన్నేసినా ఫలితం దక్కలేదు. సెమీఫైనల్లోకి ప్రవేశించటంతో 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సొంతమైంది. పురుషుల 57 కేజీల విభాగంలో రవి కుమార్ సైతం ఒలింపిక్ బెర్త్ సాధించినా, ఫైనల్లోకి చేరలేదు. సెమీఫైనల్లో వరల్డ్ చాంపియన్ జ్వార్ ఉగెవ్ చేతిలో 4-6తో ఓటమి చెందాడు. అంతకుముందు క్వార్టర్ఫైనల్లో మాజీ ప్రపంచ చాంపియన్ యుకి టకహసిపై విజయంతో రవి కుమార్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్తో కలిసి నూర్ సుల్తాన్లో భారత్ మూడు ఒలింపిక్ బెర్త్లు సాధించింది. రవి కుమార్ సైతం నేడు కాంస్యం కోసం బరిలోకి దిగనున్నాడు. రియో ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్, దివ్య కక్రన్ పోరాటానికి తెరపడింది. 62 కేజీల మహిళల విభాగంలో సాక్షి మాలిక్, 68 కేజీల మహిళల విభాగంలో దివ్య తొలి రౌండ్లోనే ఓటమిపాలయ్యారు. వీరిపై విజయం సాధించిన రెజ్లర్లు సైతం క్వార్టర్ఫైనల్స్కు ముందే ఓటమిపాలయ్యారు. దీంతో రిపిచేజ్ అవకాశం సైతం సాక్షి, దివ్యల చేజారింది. సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్లో సైతం రిపిచేజ్ బౌట్లోనే పతకం సాధించిన సంగతి తెలిసిందే.