Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొర్నపవీ చేతిలో అనూహ్య ఓటమి
- చైనా ఓపెన్ నుంచి నిష్క్రమణ
- క్వార్టర్ఫైనల్లో సాయిప్రణీత్
- చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ (చైనా): ప్రపంచ చాంపియన్కు ఊహించని భంగపాటు. వరల్డ్ విజేతగా కెరీర్ భీకర ఫామ్లో ఉన్న ప్రపంచ నం.5 పి.వి సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి నిష్క్రమించింది. అన్సీడెడ్ థారులాండ్ షట్లర్ పొర్నపవీ చొచువాంగ్ చేతిలో మూడు గేముల మ్యాచ్లో అనుకోని ఓటమి చవిచూసింది. గంట పాటు సాగిన ప్రీ క్వార్టర్స్ సమరంలో 21-12, 13-21, 19-21తో సింధు పరాజయం పాలైంది. కెరీర్ అతి పెద్ద విజయం సాధించిన వారం వ్యవధిలోనే సింధు, చైనా ఓపెన్లో కనీసం క్వార్టర్ఫైనల్స్కు చేరుకుండానే ఇంటి బాట పట్టింది. మరో అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. డబుల్స్ స్టార్ సాత్విక్సాయి రాంకీ రెడ్డి మెన్స్, మిక్స్డ్ డబుల్స్లో ప్రీ క్వార్టర్స్లో నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్లో బి. సాయిప్రణీత్ సూపర్ ప్రస్థానం కొనసాగుతోంది. చైనా షట్లర్ను వరుస గేముల్లో ఓడించిన సాయిప్రణీత్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు.
భారీ భంగపాటు! : పి.వి సింధుకు మెగా టోర్నీల ప్లేయర్గా పేరుంది. ప్రతిష్టాత్మక టోర్నీల్లో, ప్రపంచ శ్రేణి ప్రత్యర్థులపై నాణ్యమైన ఆటతీరు కనబరచటం సింధు సహజ శైలి. ఈ ఏడాది పూర్తిగా నిరాశపరిచినా, ప్రపంచ చాంపియన్షిప్స్లో మెరుగైన ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలు సాధించింది. ప్రపంచ చాంపియన్గా నిలిచిన తొలి భారత షట్లర్గా చరిత్ర సృష్టించింది. ఆ ఉత్సాహంలోనే అచ్చొచ్చిన చైనా ఓపెన్లో టైటిల్ వేటకు బరిలోకి దిగింది. ఇక్కడ సెమీఫైనల్స్ వరకూ సింధుకు తిరుగులేదనే అనిపించింది. ప్రీ క్వార్టర్స్ ప్రత్యర్థి పొర్నపవీ చొచువాంగ్ను సింధు గతంలో మూడు సార్లు ఓడించింది. సింధుపై నెగ్గిన చరిత్ర పొర్నపవీకి లేదు. దీంతో ప్రీ క్వార్టర్స్లో సింధు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. థారులాండ్ చిన్నది కథ మరోలా రాసుకున్నది. 59 నిమిషాల సమరంలో తొలి గేమ్ను ఓడినా పొర్నపవీ తర్వాతి రెండు గేముల్లో పుంజుకుంది. తొలి గేమ్లో 7-1తో భారీ ఆధిక్యం సాధించిన సింధు.. విరామం తర్వాత 19-10తో దూసుకుపోయింది. తొల గేమ్లో పొర్నపవీ అసలు పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్ పూర్తి భిన్నంగా సాగింది. 5-1తో ఆరంభంలోనే నాలుగు పాయింట్ల ఆధిక్య సాధించిన పొర్నపవీ విరామ సమయానికి 11-7తో ముందంజలో నిలిచింది. వరల్డ్ క్లాస్ ప్లేయర్ సింధుకు పుంజుకోవటం కొత్త కాదు. దీంతో సింధు రేసులోనే ఉన్నట్టు కనిపించింది. కానీ వేగంగా పాయింట్లు సాధించిన పొర్నపవీ 15-7కు ఆధిక్యం పెంచుకుంది. సింధు మరో ఐదు పాయింట్లు సాధించినా అప్పటికే పొర్నపవీ 21-13తో రెండో గేమ్ను సొంతం చేసుకుంది. మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో గేమ్లో సింధుతో పొర్నపవీ గట్టిగా పోరాడింది. ఆరంభంలో 3-3, 4-4, 5-5, 6-6తో పోటాపోటీగా పాయింట్లు సాధించారు. విరామ సమయానికి 11-7తో సింధు ముందంజ వేసింది. ద్వితీయార్థంలోనూ ఆధిక్యం నిలుపుకుంది. 15-12, 16-13, 18-15తో విజయం దిశగా సాగింది. 15-19తో సింధు మ్యాచ్ పాయింట్కు చేరువలో ఉండగా పొర్నపవీ అద్భుత ఆటతీరు కనబర్చింది. వరుసగా ఆరు పాయింట్లు కొల్లగొట్టి క్వార్టర్ఫైనల్స్ బెర్త్ను ఎగరేసుకుపోయింది. పొర్నపవీ నుంచి ఈ స్థాయి విజృంభణ ఊహించని సింధు చైనా ఓపెన్ నుంచి ప్రీ క్వార్టర్స్ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ చాంపియన్ పి.వి సింధుపై థారులాండ్ షట్లర్ పొర్నపవీకి ఇదే తొలి కెరీర్ విజయం కావటం గమనార్హం.
క్వార్టర్ఫైనల్లో సాయిప్రణీత్ : ప్రపంచ చాంపియన్షిప్స్లో ప్రకాశ్ పదుకొణె తర్వాత పతకం సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డు నెలకొల్పిన బి. సాయిప్రణీత్ వరల్డ్ క్లాస్ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. చైనా ఓపెన్లో వరుస విజయంతో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనా ఆటగాడు గాంగ్జు జులుపై 21-19, 21-19తో సాయిప్రణీత్ ఉత్కంఠ విజయం నమోదు చేశాడు. 48 నిమిషాల ప్రీ క్వార్టర్స్ పోరులో చైనా షట్లర్ అంత సులువుగా మ్యాచ్ను వదులుకోలేదు. తొలి గేమ్లో విరామ సమయానికి 11-8తో ఆధిక్యం సాధించిన సాయిప్రణీత్ను ద్వితీయార్థంలో వెంటాడు జులు. 15-15 వద్ద స్కోరు సమం చేసి వెంబడించాడు. 19-19 వద్ద సమవుజ్జీలుగా నిలిచిన వేళ సాయిప్రణీత్ వరుసగా రెండు పాయింట్లతో తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లోనూ జులు ప్రతిఘటన కొనసాగింది. 6-3, 11-8, 15-12, 18-15తో సాయిప్రణీత్ ముందంజలో నిలిచినా, చైనా షట్లర్ పోరాటం ఆపలేదు. సాయిప్రణీత్ను మ్యాచ్ పాయింట్ వద్ద నిలిపి మూడు పాయింట్లు సాధించిన జులు ఉత్కంఠ రేపాడు. 21-19తో రెండో గేమ్నూ గెల్చుకున్న సాయిప్రణీత్ క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
డబుల్స్ విభాగంలో భారత్కు నిరాశే ఎదురైంది. స్టార్ ఆటగాడు సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి వరుసగా రెండు విభాగాల్లో క్వార్టర్ఫైనల్స్కు ముందే నిష్క్రమించాడు. చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ మ్యాచ్ను 19-21, 18-21తో జపాన్ జోడీకి కోల్పోయాడు. అశ్విని పొన్నప్ప జంటగా మిక్స్డ్ డబుల్స్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ను 11-21, 21-16, 12-21తో మళ్లీ జపాన్ జంటకే సమర్పించుకున్నాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ 12-21, 17-21తో రెండో సీడ్ జపాన్ జంట చేతిలో ఓటమిపాలైంది.