Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుపు విజయంతో ఫైనల్లో ప్రవేశం
- ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్) : పసిడి సాధిస్తాడని ఆశలు పెట్టుకున్న వరల్డ్ నం.1 బజరంగ్ పూనియా అనూహ్య రీతిలో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ సైతం తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్షిప్స్లో మూడు పతకాలు సాధించినా, పసిడిపై ఆశలు ఎవ్వరికీ లేవు. కానీ జూనియర్ వరల్డ్ చాంపియన్ దీపక్ పూనియా చరిత్ర సృష్టించాడు. సీనియర్ లెవల్లో పోటీపడుతున్న తొలి ప్రయత్నంలోనే అసమాన విజయానికి చేరువయ్యాడు. పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ చాంపియన్షిప్స్ ఫైనల్లోకి ప్రవేశంతో 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసిన దీపక్ పూనియా.. నేడు పసిడి కోసం మ్యాట్పైకి రానున్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్ సమరంలో స్విట్జర్లాండ్ రెజ్లర్ రీచ్మత్ను పూనియా చిత్తుగా ఓడించాడు. 8-2తో అవలీలగా విజయం అందుకున్నాడు. మ్యాట్పై అవగాహన, డిఫెన్స్, తిరుగులేని ఎటాకింగ్ నైపుణ్యం సెమీఫైనల్లో దీపక్ పూనియాను ఎదురులేని రెజ్లర్గా నిలిపాయి. 20 ఏండ్ల దీపక్ పూనియా 2016లో వరల్డ్ జూనియర్ చాంపియన్గా నిలిచాడు. 2013లో భారత్ ప్రపంచ చాంపియన్షిప్స్లో మూడు పతకాలు సాధించింది. ఇప్పుడా రికార్డును మెరుగుపర్చాడు దీపక్ పూనియా. బజరంగ్ పూనియా, రవి కుమార్, వినేశ్ ఫోగట్లు ఇప్పటికే కాంస్య పతకాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.