Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కుర్రాడిగా డిబి దేవధర్తో కలిసి ఆడాడు. లేటు వయసులో సచిన్ టెండూల్కర్తో కలిసి బ్యాటింగ్ చేశాడు. టెస్టుల్లో 49.27 సగటుతో పరుగులు సాధించాడు. భారత క్రికెట్లో ఎవ్వరూ కోరుకోని నిష్క్రమణ అతడిది. ఆయనే మాజీ టెస్టు క్రికెటర్ మాధవ్ ఆప్టే. 87 ఏండ్ల మాధవ్ గుండెపోటుతో సోమవారం ముంబయిలోని తన నివాసంలో కన్నుమూశారు. భారత్ తరఫున ఏడు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన మాధవ్ ఆప్టే 49.27 సగటుతో 542 పరుగులు చేశాడు. అందులో 460 పరుగులు కరీబియన్ గడ్డపై అరివీర భయంకర విండీస్ పేసర్లపై బాదినవి కావటం విశేషం. మూడు అర్ధ సెంచరీలు, విండీస్పై ఓ 163 పరుగుల ఇన్నింగ్స్తో కదంతొక్కిన మాధవ్ ఆప్టే.. ఆశ్చర్యకంగా సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ ఎప్పుడూ భారత జట్టుకు ఎంపిక కాలేదు. ఓ ఆటగాడి కెరీర్ అర్థాంతరంగా, అర్థ రహితంగా ముగియటం మాధవ్ ఆప్టే విషయంలో జరిగింది. మాధవ్ ఆప్టే మృతి పట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది. సచిన్ టెండూల్కర్ శివాజీ పార్క్లో మాధవ్తో కలిసి ఆడిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
లాలా మోసం! : మాధవ్ ఆప్టే వ్యాపార కుటుంబం నుంచి వచ్చాడు. భారత జట్టుకు దూరమైనా, 71 ఏండ్ల వయసు వరకూ మాధవ్ ఆప్టే క్రికెట్లో కొనసాగాడు. సింగపూర్లో ఉన్న సమయంలోనూ ముంబయి శివాజీ పార్క్కు సాధారణ వ్యక్తిలా వచ్చి మ్యాచులు ఆడేవాడు. మాధవ్ కెరీర్ అర్థ రహితంగా ముగియటంపై తన ఆత్మకథలో దిగ్గజ క్రికెటర్ అమరనాథ్పై ఆరోపణలు చేశాడు. ' సెలక్షన్ కమిటీకి లాలా అమరనాథ్ చైర్మన్. వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా అతడు నా వద్దకు వచ్చాడు. నా తండ్రి లక్ష్మణ్ ఆప్టేను కలవాలని చెప్పాడు. నాన్న నేను క్రికెట్, వ్యాపారాలను వేరు వేరుగానే చూశాం. ఎప్పుడూ రెండింటిని కలపలేదు. ఢిల్లీలో కోహినూర్ మిల్స్ డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వాలనే ప్రతిపాదన అమరనాథ్ చేశారు. నాన్న అందుకు సున్నితంగా తిరస్కరించారు. తర్వాత కొన్నేండ్ల పాటు లాలా సెలక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగారు. టెస్టు క్రికెట్ ఆడేందుకు ఆ తర్వాత నేను ఎన్నడూ ఎంపికవలేదు' అని ఆత్మకథలో మాధవ్ రాసుకొచ్చారు.