Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్
విజయనగరం : ఫ్రీడమ్ సిరీస్కు ముందు ఏకైక వార్మప్ మ్యాచ్లో తొలి రోజు తుడిచిపెట్టుకుపోయింది. వర్షం కారణంతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో తొలి రోజు ఆట సాధ్యపడలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో దక్షిణాఫ్రికా తలపడాల్సి ఉంది. అక్టోబర్ 2 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్కు ముందు ఆడాల్సిన ఏకైక వార్మప్ ఇదే. దక్షిణాఫ్రికాతో పాటు భారత్కు సైతం వార్మప్ మ్యాచ్ కీలకమే. రోహిత్ శర్మను ఓపెనర్గా ఆడించేందుకు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దీంతో అతడిని వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా పరీక్షించే అవకాశం భారత్కు దొరికింది. రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పేసర్ ఉమేశ్ యాదవ్ వార్మప్ మ్యాచ్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలి రోజు లంచ్ తర్వాత ఆట సాధ్యపడే పరిస్థితులు లేవని అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు. విజయనగరంలోని పివిజి రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వార్మప్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. నేడు అర గంట ముందుగానే మ్యాచ్ ఆరంభం కానుంది.
రోహిత్ రాణిస్తాడు : రహానె
టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ రాణిస్తాడని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. కరీబియన్ పర్యటనలో మిడిల్ ఆర్డర్లో చోటు కోసం అజింక్య రహానెతో రోహిత్ శర్మ పోటీపడ్డాడు. కానీ రహానె, హనుమ విహారి మిడిల్ ఆర్డర్లో సూపర్ ప్రదర్శనలతో రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వలేదు. తాజాగా రోహిత్ శర్మ ఓపెనర్గా రానున్న నేపథ్యంలో రహానె స్పందించాడు. ' నేను గతంలోనే చెప్పాను. రోహిత్ శర్మ వంటి సూపర్ టాలెంటెడ్ బ్యాట్స్మన్ను పెవిలియన్లో కూర్చోబెట్టడం బాధాకరం. రోహిత్ శర్మ ఓపెనర్గా అవకాశం వస్తే, కచ్చితంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. వన్డేల్లో క్రీజులోకి వెళ్లగానే పరుగుల వేటలో పడిపోతాం. టెస్టు క్రికెట్లో కాస్త ఆలోచన శైలి మార్చుకోవాలి. ఓ సెషన్లో బౌలర్లు అద్భుతంగా బంతులేస్తే, సహనంతో గౌరవించాలి. తర్వాతి సెషన్లో మన ప్రతాపం చూపించాలి. రోహిత్ శర్మ టెస్టుల్లోనూ రాణిస్తాడని అనుకుంటున్నాను' అని రహానె అన్నాడు.