Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019 ప్రపంచకప్పై యువరాజ్ సింగ్
- నం.4 బ్యాట్స్మన్కు భరోసా దక్కలేదు
- మరో వరల్డ్కప్ ఆడలేదనే బాధ ఉంది
నవతెలంగాణ-ముంబయి
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్, భారత్ అత్యుత్తమ జట్లు అని అనుకున్నాను. వరల్డ్కప్ విజయానికి ఈ రెండు జట్లకే అధిక అవకాశం. ఇంగ్లాండ్ ఫైనల్స్కు చేరి విజేతగా నిలిచింది. భారత్ ప్రస్థానం సెమీఫైనల్లోనే ముగియడానికి ఒకే ఒక్క కారణం ఉంది. మిడిల్ ఆర్డర్లో నం.4 బ్యాట్స్మన్పై అపనమ్మకమే టీమ్ ఇండియాకు మరో ప్రపంచకప్ను దూరం చేసిందని దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్ ఆ సమయంలో జట్టు మేనేజ్మెంట్పై ఎటువంటి వ్యాఖ్యలు చేసేందుకు నిరాకరించాడు. తాజాగా ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రాణాంతక క్యాన్సర్తోనే 2011 ప్రపంచకప్ హీరోగా నిలిచిన యువరాజ్ సింగ్ మైదానంలో వీడ్కోలు పలకాలని ఎందరో అభిమానులు ఆశించారు. భారత క్రికెట్లో మాజీ స్టార్స్కు ఎదురైన చేదు అనుభవమే యువరాజ్నూ వెంటాడింది. సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి భరోసా, సమాచారం లభించని పరిస్థితుల్లో యువరాజ్ సింగ్ వీడ్కోలు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఆ బాధ నాలో ఉంది
2011 ప్రపంచకప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' గా నిలిచిన తర్వాత కెరీర్లో మరో వరల్డ్కప్ మ్యాచ్ ఆడలేదనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. కానీ 2011 ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్తో పోరాడుతూనే చెలరేగటం, తిరిగి దేశవాళీ క్రికెట్లో రెండేండ్ల పోరాటం, కఠోర సాధన అనంతరం తిరిగి జాతీయ జట్టు తరఫున 2017లో కెరీర్ అత్యధిక స్కోరు 150 (ఇంగ్లాండ్పై) సాధించటం పట్ల అభిమానులు సంతోషించారు. ఇంగ్లాండ్పై 150 ఇన్నింగ్స్ సైతం నేను సాధించిన ఓ ఘనత. ఆ సమయంలో జట్టు మేనేజ్మెంట్, నా చుట్టూ ఉన్న వాళ్ల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. జట్టు మేనేజ్మెంట్ మద్దతు ఉంటే కచ్చితంగా మరో ప్రపంచకప్ ఆడేవాడిని. ఏ స్థాయిలో క్రికెట్ ఆడినా, నా శైలినే ప్రదర్శించాను. నాకు గాడ్ఫాదర్ ఎవ్వరూ లేరు. అనారోగ్యం వేధించినా ఎంతో క్రికెట్ ఆడినందుకు గర్వపడుతున్నాను.
యో-యోతో వద్దనేశారు
పునరాగమనంలో నేడు 8-9 వన్డేలు ఆడాను. 2017 చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్పై గ్రూప్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాను. మరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన చేశాను. నా స్ట్రయిక్ రేట్ 98, సగటు 42. మిడిల్ ఆర్డర్లో నేను మెరుగైన ప్రదర్శన చేస్తున్నాను. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కరీబియన్ పర్యటనలో గాయానికి గురయ్యాను. గాయం కారణంగా చివరి టీ20లో ఆడవద్దని, శ్రీలంక పర్యటనకు సిద్ధం కావాలని జట్టు మేనేజ్మెంట్ సూచించింది. ఇంతలో యో యో టెస్టు వచ్చింది. ఈ పరీక్షలో పాసైతేనే జాతీయ జట్టుకు ఎంపిక కావాలి. యో యో పరీక్షలో ఫెయిల్ అయినవారికి జట్టులో చోటు దక్కలేదు. నా ఎంపిక విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. కచ్చితంగా యో యో టెస్టు పాస్ కావాలని చెప్పారు. 36 ఏండ్ల వయసులో నేను యోయో ఫిట్నెస్ నిరూపించుకున్నాను. అప్పుడు సెలక్టర్లు చెప్పిన మాట దేశాళీ క్రికెట్ ఆడమని. నేను వారి మాట విన్నాను, దేశవాళీలో ఆడాను. జట్టులో నాకు చోటు లేదని చెప్పడానికి పరోక్షంగా ఎంచుకున్న మార్గం యోయో అని నాకు అర్థమైంది. 36 ఏండ్ల వయసులో నేను యో యో పాస్ కాలేనని, దీంతో జట్టు మేనేజ్మెంట్ నో చెప్పే అవసరం ఉండదని భావించారు. కానీ కఠోర సాధనతో యోయో ఫిట్నెస్ నిరూపించుకున్నాను. ఈ సమయంలో నాతో ఏం చెప్పాలో జట్టు మేనేజ్మెంట్కు తోచలేదు!. జాతీయ జట్టుకు 15-17 ఏండ్లు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడిని ఎందుకు తప్పించారో చెప్పాల్సిన అవసరం లేదా? అనిపించింది. వీరెందర్ సెహ్వాగ్, జహీర్ ఖాన్ విషయంలోనూ ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. వారు ఇద్దరూ నాకంటే ఎక్కువ క్రికెట్ ఆడారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ లేదా జట్టు మేనేజ్మెంట్ ఓసారి మాట్లాడాలి. మేం యువ క్రికెటర్లతో వెళ్లాలని అనుకుంటున్నామనే మాట వెల్లడించాలి. తొలుత బాధ అనిపించినా, కనీసం నిజాయితీగా వ్యవహరించారనే తృప్తి ఉంటుంది.
నమ్మకం ఉండదా?
మిడిల్ ఆర్డర్లో నం.4 బ్యాట్స్మన్పై జట్టు మేనేజ్మెంట్ నమ్మకం ఉంచలేదు. నం.4లో నన్ను తప్పించిన తర్వాత మనీశ్ పాండేకు అవకాశం ఇచ్చారు. తర్వాత కెఎల్ రాహుల్ రేసులోకి వచ్చాడు. రాహుల్ను కాదనుకుని మళ్లీ సురేశ్ రైనాకు అవకాశం ఇచ్చారు. అతడినీ వద్దనుకుని, అంబటి రాయుడుతో 8-9 మాసాలు కొనసాగారు. న్యూజిలాండ్ పర్యటనలో రాయుడు మెరుగైన ప్రదర్శన చేశాడు. చివరకు ఆస్ట్రేలియాతో సిరీస్ను 2-3తో కోల్పోయిన సిరీస్లో రాయుడు రాణించలేదు. దీంతో విజరు శంకర్ వైపు చూశారు. ప్రపంచకప్లో భారత నం.4 చేసిన అత్యధిక స్కోరు 48. బంతి సీమ్ అయ్యే ఇంగ్లాండ్ పిచ్లపై నం.4 ప్రాధాన్యత ఎంత కీలకమో కెప్టెన్, కోచ్లకు తెలియదా? నిజంగా నాకు అర్ధం కాలేదు. నం.4 బ్యాట్స్మన్ సాంకేతికంగా మెరుగైన బ్యాట్స్మన్ అయ్యిండాలి. విలువైన అవకాశాలు అతడిని ఇవ్వాలి. విజరు శంకర్కు ఆ అనుభవం లేదు. రిషబ్ పంత్కూ ఆ అనుభవం లేదు. దినేశ్ కార్తీక్కు ఆ అనుభవం ఉంది. గ్రూప్ దశలో పెవిలియన్కు పరిమితమైన కార్తీక్.. ఆకస్మాతుగా సెమీఫైనల్లో నం.4లో బ్యాటింగ్కు వచ్చాడు. ఓ ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించినప్పుడు, అతడిని చూసేందుకు ఈ విధంగానా? తొలుత ఆటగాడికి భరోసా ఇవ్వాలి. అభద్రతా భావంలో ఉన్న ఆటగాడి నుంచి ఎన్నటికీ అత్యుత్తమ ప్రదర్శన రాబట్టలేరు. అందుకే 2019 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించలేదు.
అప్పుడు గంగూలీ.. ఇప్పుడెవరు?
యువ క్రికెటర్ రిషబ్ పంత్లో తనను తాను చూసుకుంటున్నాడు యువరాజ్ సింగ్. జట్టు మేనేజ్మెంట్ కెప్టెన్, చీఫ్ కోచ్, బ్యాటింగ్ కోచ్లు పంత్పై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై యువీ ఇప్పటికే మండిపడ్డాడు. ' బిగ్ హిట్లర్లు ఎప్పుడూ విమర్శలకు అందుబాటులో ఉంటారు. నా విషయంలోనూ ఇదే జరిగింది. అప్పుడు కెప్టెన్ సౌరవ్ గంగూలీ నుంచి నా మద్దతు లభించింది. దీంతో నాపై ప్రతి రోజు విమర్శలు ఆగిపోయాయి. ఇప్పుడు రిషబ్ పంత్ను అందరూ విమర్శిస్తున్నారు. అంతేగానీ పంత్ మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయటం లేదు. పంత్ షాట్ సెలక్షన్ సరిగ్గా లేదు. అంగీకరిస్తాను, కానీ ఆ లోపం సరిదిద్దే ప్రక్రియ ఇదేనా? జట్టు మేనేజ్మెంట్లో అతడి భుజంపై వేసి భరోసా ఇచ్చి, నీ ఆలోచన శైలి ఎలా ఉంది? ఆ సమయంలో మీ బుర్రలో ఏం మెదులుతోంది? అనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బ్యాటింగ్ కోచ్ ఈ పని చేయాలి. అలా కాకుండా 'భయం లేని క్రికెట్, బాధ్యత లేని క్రికెట్' అని మాట్లాడితే ఎలా? అని యువరాజ్ సింగ్ ప్రశ్నించాడు. మణికట్టు స్పిన్ ద్వయం యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లను బ్యాటింగ్ బలం పెంచేందుకు వదిలేయటం మూర్ఖత్వమని యువీ విమర్శించాడు. ప్రపంచ శ్రేణి బౌలర్లను బ్యాటింగ్ లోతు కోసం వదులుకోవటం మంచిది కాదని అన్నాడు.