Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో మోమోట పైచేయి
- కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్
ఇంచియాన్ : స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సీజన్లో రెండోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించిన భారత బ్యాడ్మింటన్ సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, మళ్లీ నిరాశపరిచాడు. కొరియా ఓపెన్ సెమీఫైనల్లో జపాన్ స్టార్ షట్లర్ కెంటో మోమోట చేతిలో కశ్యప్ పరాజయం పాలయ్యాడు. మాజీ వరల్డ్ నం.6 పారుపల్లి కశ్యప్ 13-21, 15-21తో వరల్డ్ నం.1 మోమోటకు తుది సమరం బెర్త్ను కోల్పోయాడు. 40 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్లో పారుపల్లి కశ్యప్ పోరాడినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్లో 9-5తో దూసుకెళ్లిన మోమోట సూపర్ ప్రదర్శనతో కశ్యప్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మోమోట స్మాష్లు, ప్లేస్లు, నెట్ గేమ్కు కశ్యప్ వద్ద సమాధానమే కరువైంది. 18-10తో భారీ ఆధిక్యం సాధించిన మోమోట తొలి గేమ్ను సులువుగానే సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో మోమోట 7-2తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించాడు. కశ్యప్ లైన్ వద్ద అధిక పాయింట్లు కోల్పోయాడు. ద్వితీయార్థంలో 12-12తో కశ్యప్ రేసులోకి వచ్చినా.. మోమోట వరుస పాయింట్ల జోరు కశ్యప్కు ఫైనల్స్ బెర్త్ను దూరం చేసింది.