Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదంలో బీసీసీఐ అంబుడ్స్మన్ నుంచి నోటీసులు అందుకున్న భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి బీసీసీఐ పదవులకు రాజీనామా చేసింది. శాంత రంగస్వామి క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) సభ్యురాలిగా, నూతనంగా ఏర్పడిన భారత క్రికెటర్ల సంఘం ఆఫీస్ బేరర్గా కొనసాగుతుంది. రాజీనామాతో శాంత రంగస్వామి అంబుడ్స్మన్ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదు. క్రికెట్ సలహా సంఘం చైర్మన్ కపిల్ దేవ్కు సొంతంగా ఫ్లడ్లైట్ల కంపెనీ ఉంది. ఓ ప్రయివేట్ కంపెనీ యజమానిగా, భారత క్రికెటర్ల సంఘం ఆఫీస్ బేరర్గా, సీఓఏ చైర్మన్గా కపిల్కు విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని అంబుడ్స్మన్ నోటీసు ఇచ్చారు. అన్షుమన్ గైక్వాడ్ సైతం భిన్న పదవుల్లో ఉన్నాడని నోటీసు జారీ అయ్యింది.
రవిశాస్త్రికి తలనొప్పి? : క్రికెట్ సలహా సంఘం సభ్యులు ముగ్గురుకీ విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని నోటీసులు జారీ కావటంతో, భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రికి తలనొప్పి మొదలైంది!. సీఏసీకి విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని అంబుడ్స్మన్ తేల్చితే.. చీఫ్ కోచ్ ప్రక్రియను తిరిగి చేపట్టాలి. మళ్లీ దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్వ్యూ నిర్వహణ, ఎంపిక చేపట్టాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మహిళల క్రికెట్ చీఫ్ కోచ్ డబ్లూవీ రామన్ను సైతం కపిల్ కమిటీ ఎంపిక చేసినా.. అప్పటికీ వారిది తాత్కాలిక నియామకం. దీంతో రామన్కు ఎటువంటి సమస్యలు రావని సమాచారం. కపిల్దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్ క్రికెట్ సలహా సంఘానికి ఎటువంటి విరుద్ధ ప్రయోజనాలు చూడలేదని, పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు క్లీన్చిట్ ఇచ్చారు.