Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో కొత్త చిక్కులు
- మాజీ క్రికెటర్ల సేవల వినియోగంలో అవాంతరాలు
నవతెలంగాణ క్రీడా విభాగం
పరస్పర విరుద్ధ ప్రయోజనాలు.. ఈ పదం వింటే చాలు భారత క్రికెట్కు వణుకు వచ్చేస్తోంది. ' ఒక వ్యక్తి ఒక సమయంలో రెండు పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదు' ఇదీ బీసీసీఐ నూతన రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనను తీసుకొచ్చినప్పుడు పరిపాలనలో పారదర్శకత, కాంట్రాక్టులను సక్రమంగా కేటాయించటం, బంధుప్రీతికి చెరమగీతం పాడటం వంటి ప్రయోజనాలను ఆశించారు. నిజానికి ఈ నిబంధనను పరిపాలన వ్యవస్థను దృష్టిలోకి తీసుకొచ్చినదే. గతంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహా రాష్ట్ర క్రికెట్ సంఘాల్లోనూ కుటుంబ పాలన కొనసాగింది. ఒకే వర్గం పదవులు, కాంట్రాక్టులు, నియామకాలను అనుభవించింది. ఈ చీకటి వ్యవస్థకు చెక్ పెట్టేందుకు జస్టిస్ లోధా కమిటీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తెరపైకి తీసుకొచ్చింది. క్రికెట్ పరిపాలకుల విషయంలో ఇది బాగుంది అనిపించినా, మాజీ క్రికెటర్ల విషయంలో నిబంధనపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అడ్డుకోగలమా? : పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగించే పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాలనేది తాజా నిబంధన. నిజానికి విరుద్ధ ప్రయోజనాలను ఏ స్థాయిలోనైనా అడ్డుకోవటం అసాధ్యమని వాస్తవిక సంఘటనలు చెబుతున్నాయి. ఇటీవల భారత మాజీ టెస్టు క్రికెటర్ మాధవ్ ఆప్టే (87) అనారోగ్యంతో మరణించారు. భారత్కు ఏడు టెస్టుల్లో 49.27 సగటుతో సూపర్ ప్రదర్శన చేసిన మాధవ్ తర్వాతి సిరీస్కు జట్టులోకి ఎంపిక కాలేదు. అరివీర భయంకర కరీబియన్ సీమర్లను వారి సొంతగడ్డపై ఎదుర్కొని 163 పరుగుల శతక ఇన్నింగ్స్ బాదాడు మాధవ్. ఈ వీరోచిత ఇన్నింగ్సే మాధవ్ కెరీర్లో చివరిదని భారత క్రికెట్లో ఎవ్వరూ ఊహించలేదు. అసలు మాధవ్ ఆప్టే ఎందుకు ఎంపిక కాలేదనే సందేహం ఏండ్లుగా వెంటాడింది. కెరీర్ అర్థరహితంగా ముగియటానికి గల కారణాలను మాధవ్ ఆప్టే తన ఆత్మకథలో వివరణంగా రాసుకున్నాడు. భారత దిగ్గజ క్రికెటర్ లాలా అమర్నాథ్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. మాధవ్ ఆప్టేది వ్యాపార కుటుంబం. కోహినూర్ మిల్స్ న్యూఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కావాలని లాలా అమరనాథ్ ప్రతిపాదించాడు. అందుకు మాధవ్ తండ్రి లక్ష్మణ్ ఆప్టే సున్నితంగా తిరస్కరించారు. తర్వాత కొన్నేండ్లు అమరనాథే సెలక్షన్ కమిటీ చీఫ్గా కొనసాగారు. ఇక్కడ ఆప్టే నుంచి ఎటువంటి ప్రయోజనం దక్కలేదనే అక్కసుతో అమరనాథ్ అతడిపై అకారణంగా వేటు వేశాడు. ఈ విషయంలో మాధవ్ ఆప్టే ఆత్మకథలో చెబితే కానీ ఎవ్వరికీ తెలియరాలేదు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా ఆపగల నిబంధనలు ఎవీ బీసీసీఐ వద్ద లేవు.
భారత క్రికెట్కు చేటు : పరస్పర విరుద్ద ప్రయోజనాలతో భారత క్రికెట్కు ముప్పు వాటిట్లే ప్రమాదం ఉంది. విరుద్ధ ప్రయోజనాలతోనే సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు క్రికెట్ సలహా సంఘం (సీఏసీ)కి దూరమయ్యారు. భారత క్రికెట్ అమూల్యమైన ఆటగాడు రాహుల్ ద్రవిడ్ సైతం ఎన్సీఏ డైరెక్టర్గా కొనసాగేందుకు విరుద్ధ ప్రయోజనాల వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా సీఏసీ సభ్యులు కపిల్ దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్లు విరుద్ధ ప్రయోజనాల విషయంలో నోటీసులు అందుకున్నారు. భారత క్రికెట్లోనే కాదు క్రీడా రంగంలో ఎక్కడా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు లభించవు. కాలానుగుణంగా మార్పుల కోసం అకాడమీలు, క్రీడా సంఘాలు నిపుణులను నియమించుకుంటాయి. భారత క్రికెట్ దిగ్గజాలు.. తిరిగి వర్థమాన క్రికెటర్లకు తమ అమూల్యమైన సేవలు అందించేందుకు ముందుకొచ్చిన వేళ విరుద్ధ ప్రయోజనాల వివాదం అడ్డు తగులుతోంది. ద్రవిడ్ విషయానికొస్తే.. ఎంతో కాలంగా ఇండియా సిమెంట్స్ ఉద్యోగిగా ఉన్నాడు. ఎన్సీఏ డైరెక్టర్గా ద్రవిడ్ పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత బీసీసీఐ నుంచి ఎటువంటి జీత భత్యాలు లభించవు. మళ్లీ ఇండియా సిమెంట్స్లో ఉద్యోగిగా వెళ్లిపోయాలి. శాశ్వత ఉద్యోగాలు కాకపోవటం, క్రికెట్కు మేలు చేసేందుకు ఉన్న ఆర్థిక వనరును వదులుకోవాల్సి రావటంతో మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ వైపు చూసే అవకాశం లేదు. అంతిమంగా భారత క్రికెట్కు ఇది కీడు చేస్తుందనే చెప్పాలి.
విరుద్ధ ప్రయోజనాల పిటిషన్లు పరిశీలించి, పరిష్కరించేందుకు బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్, అంబుడ్స్మన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డికె జైన్ అంబుడ్స్మన్గా కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజయ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్లు పూర్తిగా క్రికెటర్లకు సంబంధించినవే. క్రికెట్ పరిపాలకులపై ఒక్క పిటిషన్ కూడా వేయలేదు. భారత క్రికెట్కు సేవ చేసేందుకు ముందుకొచ్చిన మాజీ క్రికెటర్లకు విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయా? లేవా? అని తీర్పు చెప్పేందుకు బీసీసీఐ నెలకు రూ.15 లక్షలను అంబుడ్స్మన్కు వేతనంగా ఇస్తోంది. భారీ వేతనం అందించి మరీ, దిగ్గజ క్రికెటర్ల విలువైన సేవలకు చెక్ పెట్టుకుంటోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయంలో మినహాయింపుల కోసం పాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీంకోర్టుకు నివేదికలో తెలిపింది. సుప్రీంకోర్టు సూచనలపై నిర్ణయం తీసుకుంటే క్రికెటర్లకు ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.