Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్.శ్రీనివాసన్ మండిపాటు
చెన్నై : బీసీసీఐ, ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్ పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారుపై మండిపడ్డాడు. పదేండ్లకు పైగా తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) అధ్యక్షుడిగా కొనసాగిన శ్రీనివాస్ జస్టిన్ లోధా కమిటీ సిఫారసుల సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయాడు. తాజాగా జరిగిన టీఎన్సీఏ ఎన్నికల్లో శ్రీనివాసన్ తనయ రూప గురునాథ్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం టీఎన్సీఏ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. టీఎన్సీఏలో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యక్షుల విధానం కొనసాగుతోంది. 150 క్లబ్లకు ఓ ఉపాధ్యక్షుడు, 30 జిల్లాలకు మరో ఉపాధ్యక్షుడు పని చేస్తున్నారు. ఆఫీస్ బేరర్ల నియామకంలోనూ టీఎన్సీఏ పాత పద్దతులు కొనసాగిస్తోంది. ఈ విషయంపై టీఎన్సీఏ కోర్టుకెక్కింది. ఎన్నికలు యథాప్రకారం జరగాలని, కోర్టు తీర్పు అనుసారం మిగతా ప్రక్రియ సర్దుబాటు ఉంటుందని సెప్టెంబర్ 20న కోర్టు ఆదేశించింది. తాజాగా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సీఓఏ, ఎన్నికల అధికారి ఎన్. గోపాలస్వామి పంపిన లేఖలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం నూతన పద్దతులు పాటించని రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండబోదని, వార్షిక సర్వ సభ్య సమావేశానికి హాజరు అయ్యే హక్కు ఉండదని హెచ్చరించింది. ఈ లేఖ సారాంశంపై శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదర్శాలను, ఆదేశాలు.. సీఓఏ వినోద్ రారు సమవుజ్జీలు కాదనే విషయం గుర్తుంచుకోవాలని చురకంటించారు. ఓటు హక్కు నిరాకరిస్తే, రాష్ట్ర సంఘాలకు సంక్రమించిన న్యాయబద్దమైన హక్కులు హరించటమే, రాష్ట్ర సంఘాలను బీసీసీఐ సేవక సంఘాలుగా మార్చేందుకు వినోద్ రారు ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నారని శ్రీనివాసన్ విమర్శించారు.