Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంచి ఉన్న వర్షం ముప్పు
- సఫారీ ఎదురుదాడి యోచన!
నవతెలంగాణ-క్రీడావిభాగం
ఫ్రీడం సిరీస్ తొలి టెస్టులో నాలుగు రోజులు ముగిశాయి. ఊహించినట్టుగానే ఆఖరు రోజు ఆట ఆసక్తికరంగా మారింది. తొలి నాలుగు రోజుల్లో మూడు రోజులు ఆతిథ్య భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఓ రోజు ఆటను శాసించిన దక్షిణాఫ్రికా ఇప్పటికీ డ్రా అవకాశాలను సజీవంగా నిలుపుకుంది!. సొంతగడ్డపై స్పిన్ ఎదుర్కొవటంలో బలహీన జట్టు దక్షిణాఫ్రికాకు 395 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉపఖండంలో ఆఖరు రోజు 395 పరుగులు కొట్టాలనే ఆలోచన రావటం సాహసోపేతం. అదే సమయంలో రోజంతా 9 వికెట్లు కాచుకోవటం అసాధ్యమని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఈ లెక్కన విశాఖ టెస్టు టీమ్ ఇండియా గుప్పిట్లో ఉందని సంతోషం వ్యక్తం చేయవచ్చు. కానీ విశాఖ టెస్టు తొలి నాలుగు రోజుల ఆట అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ జరిగిన వన్డేలు, టీ20ల్లోనూ పరుగులు చేసేందుకు బ్యాట్స్మెన్ ఆపసోపాలు పడిన సందర్బాలు ఉన్నాయి. కానీ ఈ టెస్టులో పరుగుల వరద పారింది. బ్యాట్స్మన్ అలవోకగా స్ట్రయిక్ రొటేట్ చేయటమే కాదు ఎడాపెడా బౌండరీలూ బాదుతున్నారు. రెండో రోజు నుంచి స్పిన్ ప్రభావం కనిపించే విశాఖలో విచిత్రంగా 3, 4వ రోజుల్లో 350పైలుకు పరుగులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఐదో రోజు కోహ్లిసేన కలవరపాటుకు కారణం అవుతున్నాయి.
మూడో రోజు దక్షిణాఫ్రికా 98 ఓవర్ల పాలు బ్యాటింగ్ చేసింది. 343 పరుగులు సాధించింది. ఉపఖండంలో అశ్విన్, జడేజా వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లను ఎదుర్కొని ఇన్ని పరుగులు చేయటం దక్షిణాఫ్రికా సాధించిన అరుదైన ఘనత అని చెప్పాలి. నాల్గో రోజు మరింత టర్న్ ఉంటుందని అనుకున్నా.. ఓవరాల్గా 94 ఓవర్లలో 369 పరుగులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా 46 పరుగులు చేయగా.. భారత్ 323 పరుగులు కొట్టింది. స్పిన్ పిచ్పై నాల్గో రోజు 369 పరుగులు చేసినప్పుడు.. నాల్గో రోజు సైతం ఆ అవకాశం ఎందుకుండదు? అనే అనుమానం వ్యక్తమవుతోంది. దక్షిణాఫ్రికాకు ఇప్పుడు మరో 384 పరుగులు అవసరం. రెండో ఇన్నింగ్స్లో విపరీత ఒత్తిడిని జయించి సఫారీ దూకుడుగా ఆడుతుందని ఆశించలేం. కచ్చితంగా రక్షణాత్మకంగా ఆడేందుకు మొగ్గు చూపుతుంది. తొలి ఇన్నింగ్స్లో డిఫెన్స్తో దెబ్బతిన్నామని, ఎదురుదాడి చేసిన సఫారీ.. రెండో ఇన్నింగ్స్లో సైతం ఆ సాహాసానికి సిద్ధపడితే విశాఖ టెస్టు రసకందాయంలో పడనుంది. తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ ఏడు వికెట్లు కూల్చినా.. 145 పరుగులు ఇచ్చాడు. జడేజా సైతం 2 వికెట్లకు 124 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఎదురుదాడి చేస్తే కోహ్లిసేన చేయగల్గిందేమీ లేదు!.
ఇన్నింగ్స్ డిక్లరేషన్ సమయంపైనా కాస్త చర్చ జరుగుతోంది. టీ సమయానికే భారీ స్కోరు సాధించి.. బౌలర్లకు 10 వికెట్ల వేటలో 120 ఓవర్లు అందుబాటులో ఉంచితే బాగుండేది. రోహిత్ శర్మ, పుజార చెలరేగినా టీ సమయానికి భారత్ ఆధిక్యం 250 పరుగుల లోపే ఉంది. దీంతో టీ విరామం తర్వాత సైతం భారత్ బ్యాటింగ్ కొనసాగించింది. 400 చేరువ లక్ష్యంలో దక్షిణాఫ్రికాను ఛేదనకు పిలిచింది. డిక్లరేషన్ టైమింగ్, అందుబాటులోని ఓవర్లు, పిచ్ స్వభావానికి తోడు నేడు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. తొలి రెండు సెషన్లకు పాక్షికంగా వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో విశాఖ టెస్టు ఐదో రోజు ఆసక్తి రేపుతోంది. గెలుపు దారిపై ఎన్ని ప్రశ్నలు ఉన్నా.. నేడు కోహ్లిసేన ప్రదర్శనే అన్నింటికి సమాధానం కానుంది.