Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
2015 నుంచి భారత్లో ఓ టెస్టు నాల్గో ఇన్నింగ్స్లో రెండు జట్లు మాత్రమే 100కు పైగా ఓవర్లు ఆడాయి. 2017లో శ్రీలంక 100 ప్లస్ ఓవర్ల ప్రతిఘటనతో డ్రా చేసుకుంది. 2015 ఢిల్లీ టెస్టులో దక్షిణాఫ్రికా 143.1 ఓవర్ల పాటు సహనం చూపించింది. అయినా, 143 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. స్పిన్ స్వర్గధామం ఉపఖండం పిచ్లపై నాల్గో ఇన్నింగ్స్లో పరుగులు సాధనతో పాటు వికెట్ కాపాడుకోవటం కత్తి మీద సామే. విశాఖ టెస్టులో దక్షిణాఫ్రికాకు 395 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. అయినా, ఏదో కోశాన ఆందోళన. ఎందుకుంటే విశాఖ టెస్టు నాలుగు రోజుల్లో పరుగుల ప్రవాహాన్ని చూసింది. ప్రత్యేకించి 3, 4 రోజుల ఆటలో 343, 369 పరుగులు నమోదయ్యాయి. దీంతో సహజసిద్ధ స్పిన్ పని చేయగలదా? సఫారీ ప్రతిఘటనకు పూనుకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉదయించాయి. కోహ్లిసేన ఈ ఆందోళనకు తొలి సెషన్లోనే మంగళం పాడేసింది. సీమ్తో మహ్మద్ షమి, స్పిన్తో రవీంద్ర జడేజా విశ్వరూపం దాల్చగా, గాంధీ-మండేలా ఫ్రీడం సిరీస్ తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను భారత్ స్వేచ్ఛగా జయించింది.
విశాఖ పిచ్పై ధారాళంగా పరుగులు వచ్చినా, ఓ విషయంలో పిచ్ నిలకడ చూపింది. ఉదయం సెషన్లో పరుగులు ఏ రోజులోనూ అంత సులువుగా రాలేదు. ఈ సెషన్లో బంతి లో లెంగ్త్లో ఉంచగలిగితే బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలమని భారత్ భావన. తొలి ఇన్నింగ్స్లో మహ్మద్ షమి వికెట్ పడగొట్టకపోయినా, ఆఖరు రోజు షమి అత్యంత ప్రమాదకారి. ఐదో రోజు తొలి ఓవర్ వేసిన మహ్మద్ షమిపై ఓ ఫోర్తో దక్షిణాఫ్రికా 7 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే 7 పరుగులతో సఫారీ ఎదురుదాడి చేయనుందా? అనే ఆసక్తి నెలకొంది. తర్వాతి ఓవర్లో అశ్విన్ వికెట్ల వేటకు తెరతీయగా.. మహ్మద్ షమి, రవీంద్ర జడేజాలు మరో స్థాయికి తీసుకెళ్లారు. మహ్మద్ షమి వికెట్ టు వికెట్ బంతులు సంధించాడు. ఆఫ్ సైడ్ వైడ్ బంతులతో పాటు బౌన్సర్లు సైతం విసిరాడు. ఇదే సమయంలో అతి తక్కువ బౌన్స్తో వికెట్లపైకి దూసుకెళ్లాడు. షమి నుంచి అధిక బౌన్స్ అంచనా వేసిన బవుమా.. ఊహించని పరిణామంతో ఖిన్నుడయ్యాడు. సఫారీ కెప్టెన్ డుప్లెసిస్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్లకూ ఇదే బంతి సంధించిన షమి వికెట్లను గాల్లోకి లేపాడు. రవీంద్ర జడేజా ఫ్లాట్ బంతులు, క్విక్ పేస్తో ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్డాడు. తొలి సెషన్లోనే 7 వికెట్లు కూల్చిన కోహ్లిసేన ఘన విజయానికి రంగం సిద్ధం చేసుకుంది. తోక మరోసారి భారత్ సహనాన్ని పరీక్షించినా.. స్వేచ్ఛా విజయాన్ని అడ్డుకోలేదు. దక్షిణాఫ్రికా క్రికెట్లో దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, హషీమ్లా, డెల్ స్టెయిన్ రిటైర్మెంట్తో సఫారీ జట్టులో పస తగ్గిన మాట వాస్తవం. ఈ ముగ్గురు దిగ్గజాలతో కూడిన జట్టుతో దక్షిణాఫ్రికా 2015లో భారత పర్యటనకు వచ్చింది. రెండో ఇన్నింగ్స్ల్లో వరుసగా 185 (నాగ్పూర్), 143 (న్యూఢిల్లీ), 109 (మొహాలీ) పరుగులే చేసింది. అనుభవం లేని ప్రస్తుత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 431 పరుగులు సహా ఛేదనలో 191 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తిరుగులేని విజయం సాధించినా, సఫారీ పోరాటతత్వం విడిచిపెట్టలేదని చెప్పవచ్చు. తొలి టెస్టు విజయంతో సొంతగడ్డపై వరుసగా 11వ సిరీస్ సాధించేందుకు కోహ్లిసేన అడుగు ముందుకు వేసింది.
'తొలి మూడు రోజులు పిచ్ బాగుంది. ఓ సెషన్లో వెనుకంజ వేశాం, అది కొంత కఠినం. 500 కొట్టినప్పుడు పుంజుకోవటం ప్రత్యర్థికి ఎప్పుడూ కష్టమే. రోహిత్, మయాంగ్ అద్భుతంగా ఆడారు. రెండో ఇన్నింగ్స్లో పుజార ఇన్నింగ్స్ సూపర్. పరిస్థితులు, పిచ్ నెమ్మదిగా స్పందించటంతో పరుగులు చేయటం కష్టం. చిన్న స్పెల్స్ వేసినా, భారత్లోనూ పేసర్లు వికెట్లు తీస్తున్నారు. కొంత కాలంగా రెండో ఇన్నింగ్స్లో మా వికెట్ల వేటగాడు మహ్మద్ షమి. స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఎప్పట్లాగానే మెప్పించారు'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్