Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టెస్టులో ఇన్నింగ్స్, 137 పరుగులతో భారత్ ఘన విజయం
- రెండో ఇన్నింగ్స్లో 189కే దక్షిణాఫ్రికా ఆలౌట్
- సొంత గడ్డపై వరసగా 11వ టెస్టు సిరీస్ కైవసం
శ్రీనివాస్ దాస్ మంతటి నవతెలంగాణ - పుణే
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్కు దిగిన దక్షిణా ఫ్రికా 67.2 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటయింది. దీంతో ఈ టెస్టు మ్యాచ్లో ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఈ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో చివరి, నామమాత్రమైన మూడో టెస్టు శనివారం రాంచీలో ఆరంభం కానుంది. సొంత గడ్డపై భారత్కు ఇది వరసగా 11వ టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం.
ఆదివారం ఆటలో ప్రారంభం నుంచి భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల రెండో ఇన్నింగ్స్ టీ బ్రేక్ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో డీన్ ఎల్గర్(48), బావుమా(38), ఫిలిండర్(37), మహరాజ్(22)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలయ్యారు.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో మార్కరమ్ను తొలి వికెట్గా ఇషాంత్ ఔట్ చేస్తే, డిబ్రుయిన్(8)ను ఉమేశ్ యాదవ్ బోల్తా కొట్టించాడు. సాహా అద్భుతమైన క్యాచ్తో డిబ్రుయిన్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో 21 పరుగులకే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోగా, డుప్లెసిస్(5) అశ్విన్ ఔట్ చేశాడు. ఇక్కడ కూడా సాహా మరో చక్కటి క్యాచ్ పట్టడంతో డుప్లెసిస్ భారంగా పెవిలియన్ వీడాడు. ఆపై ఎల్గర్, డీకాక్(5),బావుమాలు పెవిలియన్ చేరారు. ఈ సమయంలో మహరాజ్-ఫిలిండర్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ జోడి 57 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ఫిలిండర్ ఔట్ కాగా, ఆపై కాసేపటికి రబడా పెవిలియన్ చేరాడు. చివరి వికెట్గా మహరాజ్ ఔట్ కావడంతో భారత్కు ఇన్నింగ్స్ విజయం దక్కింది. ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే మ్యాచ్ను భారత్ ముగించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. షమీ, ఇషాంత్లకు చెరో వికెట్ దక్కింది. ఈ టెస్టులో డబుల్ సెంచరీతో రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ను 5 వికెట్లకు 601 పరుగుల వద్ద డిక్లైర్డ్ చేయగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 275 పరుగులకే ఆలౌటయింది. ఫాలోఆన్ ఆడింది.
రికార్డులే రికార్డులు..
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో విజయంతో భారత క్రికెట్ జట్టు కొత్త రికార్డును లిఖించింది. స్వదేశంలో వరుస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా కొత్త రికార్డు నెలకొల్పింది. ఇది భారత్కు స్వదేశంలో వరుసగా 11వ టెస్టు సిరీస్ విజయం. దీంతో గతంలో ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డును టీమిండియా బద్ధలు కొట్టింది. 1994-95 సీజన్ నుంచి 2000-01 సీజన్ వరకూ ఆసీస్ స్వదేశంలో వరుసగా10 టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. 2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 స్వదేశీ టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఫలితంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ జాబితాలో వెస్టిండీస్ 8 టెస్టు సిరీస్ విజయాలతో (1975-76 సీజన్ నుంచి 1985-86 సీజన్ వరకూ) మూడో స్థానంలో ఉంది.
ప్రస్తుత విజయంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సాధించాడు. కెప్టెన్గా తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. టెస్టు కెప్టెన్గా కోహ్లికి ఇది 30వ విజయం. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో స్టీవ్ వా(37), రికీ పాంటింగ్(35)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో వివ్ రిచర్డ్స్(27) నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ తరఫున కోహ్లి కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లకు సారథిగా చేసిన ఎంఎస్ ధోని (27 విజయాలు) ఉన్నాడు. ధోని మొత్తంగా 60 టెస్టులకు కెప్టెన్గా చేశాడు. కోహ్లి, ధోని తర్వాత భారత్ జట్టుకు తరఫున ఎక్కువ టెస్టు మ్యాచ్లకు సౌరవ్ గంగూలీ సారథిగా వ్యవహరించాడు. గంగూలీ కెప్టెన్గా చేసిన టెస్టుల సంఖ్య 49.
దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించిన కెప్టెన్గా కోహ్లి నిలిచాడు. 2010లో ధోని కెప్టెన్గా భారత్ దక్షిణిఫ్రి కాపై ఇన్నింగ్స్, 57 పరుగులతో విజయం సాధించింది.
ఈ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కోహ్లి భారత్ తరపున అత్యధిక డబుల్స్ సెంంచరీలు (7) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (254) చేసిన భారత కెప్టెన్గా నిలిచాడు.న