Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో అమిత్ షా కుమారుడు, అనురాగ్ ఠాకూర్ సోదరుడు
- ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఎన్నిక దాదాపు ఖాయమైంది. నామినేషన్ దాఖలుకు సోమవారం సాయంత్రం చివరితేదీ కావడంతో ఆయన ఇక్కడి బిసిసిఐ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయమే కానుంది. నామినేషన్ల దాఖలు సమయంలో ఆయన వెంట బిసిసిఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్. శ్రీనివాసన్, ఐపిఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. కార్యదర్శి పదవికి కేంద్ర హోమంత్రి అమిత్ షా కుమారుడైన జై షా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కోశాధికారి పదవికి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధూమల్ నామినేషన్ వేశారు. తొలుత అధ్యక్ష పదవికి శ్రీనివాస్ సన్నిహితుడు బ్రిజేష్ పటేల్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ... ఆదివారం జరిగిన సమావేశంలో అనేక రాష్ట్ర సంఘాల ప్రతినిధులు గంగూలీకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. నామినేషన్ల పరిశీలన అనంతరం అధికారికంగా గంగూలీ ఎన్నికను ప్రకటిస్తారు. ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అక్టోబర్ 23న జరగుతాయి.
ఆరు దశాబ్దాల తర్వాత గంగూలీనే...
నూతన అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు చేపడితే సుమారు ఆరు దశాబ్దాల తర్వాత ఆ పదవి చేపట్టిన తొలి క్రికెటర్గా గంగూలీ నిలవనున్నారు. గతంలో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్లు తాత్కాలిక అధ్యక్షులుగా మాత్రమే కొనసాగారు. 65 ఏళ్ల క్రితం విజయనగరం మహారాజు విజయ ఆనంద గజపతిరాజు(విజ్జీ) బిసిసిఐ అధ్యక్షుడిగా పూర్తిస్థాయి సేవలందించారు. వివాదాస్పద క్రికెటర్గా ముద్రపడిన ఎకెఏ విజ్జీ.. 1954-56 కాలంలో బిసిసిఐ అధ్యక్షులుగా సేవలందించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరో క్రికెటర్ బిసిసిఐ అధ్యక్ష పదవిని పూర్తిస్థాయిలో చేపట్టే అవకాశం రానుంది. గంగూలీ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. 'బెంగాల్ టైగర్ ఈజ్ బ్యాక్' అని కొందరు ప్రశంసించగా, 'ఒక ప్లేయర్గా, ఒక కెప్టెన్గా, ఒక కామెంటేటర్గా గంగూలీ సక్సెస్ అయ్యాడు.. ఇప్పుడు బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ ముద్ర ఖాయం' అని మరికొందరు ట్వీట్ చేశారు.