Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి భారత్ × దక్షిణాఫ్రికా మూడోటెస్ట్
- గెలిస్తే పలు రికార్డులు కోహ్లీ ఖాతాలో
- ఉదయం 9.30 గం||ల నుంచి స్టార్స్పోర్ట్స్లో
రాంచీ: మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా సఫారీలతో జరిగిన రెండు టెస్టుల్లోనూ గెలిచిన టీమిండియాను ఇప్పుడు సరికొత్త రికార్డు ఊరిస్తోంది. శనివారం దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న టెస్టు మ్యాచ్లోనూ భారత్ విజయం సాధిస్తే పలు రికార్డులు కోహ్లీ ఖాతాలో చేరనున్నాయి. మూడు టెస్ట్ల సిరీస్లో తొలి రెండు టెస్ట్ మ్యాచ్లను గెలిచిన కోహ్లీసేన ఇప్పటికే 2-0 ఆధిక్యతలో నిలిచింది. ఒకవేళ నేటినుంచి ప్రారంభం కానున్న టెస్ట్లోనూ సఫారీలపై టీమిండియా గెలిస్తే తొలిసారి క్లీన్స్వీప్ చేసే ఘనతను సాధిస్తుంది. ఇప్పటివరకూ భారత్ జట్టు.. దక్షిణాఫ్రికాపై ఏ టెస్టు సిరీస్లోను క్లీన్స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ అవకాశం ఇప్పుడు విరాట్ సేన ముందుంది. రాంచీ టెస్టులో భారత్ గెలిస్తే సఫారీలను వైట్వాష్ చేసి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. భారత్లో చివరిసారి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. అందులో మూడు టెస్టులను భారత్ గెలవగా, ఒక టెస్టు డ్రా అయ్యింది. దాంతో సఫారీలను క్లీన్స్వీప్ చేసి కొత్త చరిత్ర సృష్టించాలనే యోచనలో టీమిండియా ఉంది.
ఇక టెస్టు ఫార్మాట్లో ఇరుజట్లు ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా, స్వదేశంలో జరిగే టెస్టుల విషయంలో మాత్రం టీమిండియాదే పైచేయిగా ఉంది. కేవలం సఫారీలతో ఒక్క సిరీస్ను మాత్రమే టీమిండియా కోల్పోయింది. కాకపోతే దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం భారత్ ఇంకా టెస్టు సిరీస్ను గెల్చుకోలేదు. ఇక ఓవరాల్గా ఇరుజట్లు ముఖాముఖి టెస్టు పోరులో దక్షిణాఫ్రికా 15 విజయాలు సాధించగా, భారత్ 13 విజయాలు మాత్రమే నమోదు చేసింది. విశాఖ వేదికగా జరిగిన తొలిటెస్ట్లో టీమిండియా 203 పరుగుల తేడాతో గెలవగా... పుణెలో జరిగిన రెండోమ్యాచ్లో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన భారతజట్టు స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్లు గెల్చి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఆసీస్ను వెనక్కినెట్టింది. ఆసీస్ 10 వరుస సిరీస్లు సాధించగా, దాన్ని భారత్ ఇప్పుడు బ్రేక్ చేసింది.
ప్రధాన ఆటగాళ్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా లేకపోయినా టీమిండియా సమిష్టిగా రాణించిన అద్భుత విజయాలను నమోదు చేసింది. కాగా రాంచీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమైనందుకు మూడో టెస్టులో ఒక పేసర్ను తగ్గించనున్నట్లు సమాచారం. గాయం కారణంగా కుల్దీప్ యాదవ్ మూడోటెస్ట్కు దూరం కావడంతో యువ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ను తుదిజట్టులోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీసేన మరోసారి సత్తా చాటితే ఖచ్చితంగా విజయం సాధించి ధక్షిణాఫ్రికాను వైట్వాష్ చేస్తుందడనంలో సందేహం లేదు.
భారత జట్టు(అంచనా): విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజరా, అజింక్యా రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, షాబాజ్ నదీమ్, ఇషాంత్/ఉమేష్, మహ్మద్ షమి.
దక్షిణాఫ్రికా జట్టు (అంచనా): డుప్లెసిస్(కెప్టెన్), హంజా, ఎల్గర్, బ్రుయాన్, బవుమా, డికాక్(వికెట్ కీపర్), ఫిలాండర్, కేశవ్ మహరాజ్, రబడా, ఎన్గిడి/ముత్తుసామి, పిడిట్/నూర్జె.