Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 డిమాండ్ల సాధనకు క్రికెటర్ల పట్టు
- సమ్మెలో 50 మంది క్రికెటర్లు
- భారత పర్యటనపై నీలినీడలు!
ఢాకా (బంగ్లాదేశ్)
అసంబద్ద విధానాలు, అత్యల్ప వేతనాలు, లోపించిన దీర్ఘకాల ప్రణాళిక.. బంగ్లాదేశ్ క్రికెట్లో సమ్మె సైరన్ మోగించింది. అవును నిజమే, బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మెలోకి వెళ్తున్నట్టు సోమవారం ప్రకటించారు. తమ డిమాండ్ల సాధనకు ఇదే సరైన మార్గంగా క్రికెటర్లు ఎంచుకున్నారు. ఈమేరకు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్లు సోమవారం అధికారిక మీడియా సమావేశంలో వెల్లడించారు. బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మెతో వచ్చే నెలలో జరగాల్సి ఉన్న భారత్ పర్యటనపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకిబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్ఫీకర్ రహీంలు సోమవారం మీడియా సమావేశంలో సమ్మె సైరన్ మోగించారు. సుమారు 50 మంది బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మెలో పాలు పంచుకోనున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ దేశవాళీ క్రికెట్ సహా ఎటువంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనేది లేదని క్రికెటర్లు స్పష్టం చేశారు.
ఎందుకీ సమ్మె : బంగ్లాదేశ్ క్రికెట్లో చాలా ఏండ్ల నుంచి సమస్యలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)తో బంగ్లా క్రికెటర్లు ఆకర్షణీయ మొత్తంలో కొంత డబ్బు అందుకుంటున్నారు. కానీ ఫ్రాంచైజీ యజమానులతో బంగ్లా క్రికెట్ బోర్డుకు విభేదాలు వచ్చాయి. దీంతో వచ్చే సీజన్ నుంచి బీపీఎల్ను బంగ్లా క్రికెట్ బోర్డు నేరుగా నడుపనుంది. ఈ చర్య లీగ్లో పాల్గొనే క్రికెటర్ల ఆదాయాన్ని గణనీయంగా తగ్గించబోతుంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచు ఫీజు చాలా తక్కువగా ఉంది. బోర్డు ఫీజులను పెంచటం లేదు. మైదాన సిబ్బంది, కోచ్లు, ట్రైనర్లు, ఫిజియోలు చాలా తక్కువ మొత్తాల్లో వేతనాలు తీసుకుంటున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మెరుగైన రీతిలో ఆదాయం ఆర్జిస్తోంది. అయినా వేతనాలు, ఫీజులు పెంచటం లేదు. బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్దికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవటం లేదు. భారత్, ఇంగ్లాండ్ వంటి దేశాలు నాలుగేండ్ల ముందుగానే ప్రణాళికతో ముందుకు సాగుతుంటే.. బంగ్లాదేశ్ మాత్రం ఏ సిరీస్ ఆడితే అప్పటికే ప్రణాళిక అనే సంప్రదాయం కొనసాగిస్తుంది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో జట్టు ప్రదర్శనపై ప్రణాళిక లేమి తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్కు ప్రోఫెషనల్ మార్గదర్శకత్వం రావాలని క్రికెటర్లు బలంగా కోరుతున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెటర్ల డిమాండ్లపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
మరోవైపు బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మెపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ కన్నేసింది. బంగ్లాదేశ్తో రానున్న సిరీస్ సమయానికి ఇది సద్దుమణిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కోల్కతలో బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్ నేపథ్యంలో సమ్మె భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో భారత పర్యటనలో ఉన్న సమయంలో వెస్టిండీస్ ఆటగాళ్లు సమ్మెలోకి వెళ్లగా.. తాజాగా భారత పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె చేస్తుండటం గమనార్హం.