Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు సైనా, శ్రీకాంత్ పోరు
- ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
పారిస్ : ప్రపంచ చాంపియన్ పి.వి సింధు ఫ్రెంచ్ ఓపెన్లో శుభారంభం చేసింది. వరుసగా చైనా, కొరియా, డెన్మార్క్ ఓపెన్లలో నిరాశపరిచిన సింధు పారిస్లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. మహిళల సింగిల్స్లో వరల్డ్ నం.6 సింధు వరుస గేముల్లో గెలుపొందింది. కెనడా షట్లర్ మిచెలీ లీపై 21-15, 21-13తో వరుస గేముల్లో విజయం సాధించింది. గతంలో మిచెలీ లీ రెండు సార్లు సింధుపై విజయం సాధించింది. ఆరంభ రౌండ్లలో తడబడుతున్న సింధును పారిస్లోనూ ఇబ్బంది పెట్టవచ్చని భావించింది. కానీ సింధు తొలి రౌండ్లో మెరుగ్గా రాణించింది. 41 నిమిషాల్లోనే తొలి రౌండ్ గండం గట్టెక్కింది. రెండో రౌండ్లో సింగపూర్ షట్లర్ యో జియా మిన్తో సింధు తలపడనుంది. వరల్డ్ నం.26 సింగపూర్ షట్లర్కు వరల్డ్ చాంపియన్తో ఇదే తొలి ముఖాముఖి పోరు. పురుషుల సింగిల్స్లో శుభాంకర్ దే 15-21, 21-16, 21-16తో టామీ సుగియార్టో (ఇండోనేషియా)పై మూడు గేముల్లో పోరాడి గెలుపొందాడు.
మహిళల సింగిల్స్లో మాజీ వరల్డ్ నం.1 సైనా నెహ్వాల్ నేడు తొలి రౌండ్లో పోటీపడనుంది. హాంగ్కాంగ్ షట్లర్ చెంగ్ నగన్ యితో సైనా పోటీపడనుంది. పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. కిదాంబి శ్రీకాంత్కు రెండో సీడ్ చో తిన్ చెన్ (చైనీస్ తైపీ) తొలి సవాల్ విసరనున్నాడు. డబుల్స్లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి నేడు తొలి రౌండ్లో బరిలోకి దిగనున్నారు.