Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతలు అప్పగించనున్న సీఓఏ
నవతెలంగాణ - ముంబయి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త శోభను సంతరించుకోనుంది. 2013 ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత జరిగిన పరిణామాలతో బీసీసీఐలో సమూల సంస్కరణలకు అత్యున్నత న్యాయస్థానం కీలక చర్యలు తీసుకుంది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమలుకు మాజీ కాగ్ వినోద్ రారు సారథ్యంలో పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించింది. 2017 జనవరిలో ఏర్పాటైన వినోద్ రారు పాలకుల కమిటీ బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో సంస్కరణల కోసం కృషి చేసింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్ల అధికారాలను తానే స్వయంగా స్వీకరించిన పాలకుల కమిటీ.. బీసీసీఐకి ప్రొఫెషనల్ ఆడ్మినిస్ట్రేషన్ పరిచయం చేసేందుకు ప్రయత్నించింది. పాలకుల కమిటీలోనే విభేదాలు, బీసీసీఐ ఆఫీస్ బేరర్ల ధిక్కారం, రాష్ట్ర సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమలుకు రారు కమిటీ రంగం సిద్ధం చేసింది. బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం బీసీసీఐ నూతన పాలక మండలి నేడు ఎన్నిక కానుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారి పదవులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా నేడు జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఎజీఎం)లో బాధ్యతలు స్వీకరించనున్నాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కార్యదర్శిగా ఎన్నిక కానున్నాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు అజరు కుమార్ కోశాధికారిగా బాధ్యతలు అందుకోనుండా, మాజీ క్రికెటర్ బ్రిజేశ్ పటేల్ ఐపీఎల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. నేడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బోర్డు ఏజీఎం జరుగనుంది.
సీఓఏపై చర్యలు వద్దు : బీసీసీఐ సంస్కరణల పర్వం పర్యవేక్షణ, అమలు చూసిన పాలకుల కమిటీ సభ్యులపై ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నూతనంగా ఎన్నిక కానున్న బీసీసీఐ పాలక మండలికి బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా కోర్టు రారు కమిటీకి తెలిపింది. ' బీసీసీఐ నూతన పాలక మండలి ఎన్నికతో సీఓఏ కథ ముగుస్తుంది. అభ్యంతరాలు, ఆరోపణల నుంచి కమిటీ సభ్యులు విముక్తులు అవుతారు. మంచి ఉద్దేశంతో పని చేసిన కమిటీ సభ్యులపై తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. వ్యక్తిగతంగా, బృందంగా కమిటీ సభ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు' అని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. పాలకుల కమిటీ సభ్యులుగా పని చేసిన కాలానికి ఆకర్షణీయ మొత్తంలో వేతనం అందించాలని బోర్డును ఆదేశించింది. 2017లో నెలకు రూ. 10 లక్షలు, 2017లో నెలకు రూ. 11 లక్షలు, 2018లో నెలకు రూ. 12 లక్షల చొప్పున పాలకుల కమిటీ సభ్యులకు వేతనం 48 గంటల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.