Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలుపు వేటలో రోహిత్సేన
- రాజ్కోట్లో రెండో టీ20 నేడు
- సిరీస్ విజయంపై బంగ్లాదేశ్ కన్ను
- భయపెడుతున్న మహా తుఫాన్
నవతెలంగాణ-రాజ్కోట్
క్రికెట్లో ఏదైనా సాధ్యమే. బంగ్లాదేశ్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. సూపర్స్టార్ షకిబ్ అల్ హసన్, ప్రధాన బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్, అనుభవజ్ఞుడైన పేసర్ మొర్తజా సేవలు అవసరం లేకుండానే బంగ్లాదేశ్ న్యూఢిల్లీలో చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో భారత్పై తొలి విజయం నమోదు చేసింది. అండర్డాగ్గా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్, రెండో టీ20 సమయానికి సిరీస్ ఫేవరెట్గా అవతరించింది. ఆతిథ్య టీమ్ ఇండియా ఇప్పుడు ఒత్తిడిలో పడిపోగా.. రెట్టించిన ఉత్సాహంతో బంగ్లాదేశ్ సిరీస్పై కన్నేసింది. తుపాను ముప్పు పొంచి ఉన్న రాజ్కోట్ టీ20లో విజయం కోసం రోహిత్ సేన గురి పెట్టింది. నేడు మ్యాచ్ రద్దు అయినా సిరీస్ సొంతం చేసుకునే స్థితిలో భారత్ ఉండబోదు. భారత్, బంగ్లాదేశ్ రెండో టీ20 నేడు.
మళ్లీ అతడే ఫోకస్ : రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి రెండేండ్లు అవుతోంది. అరంగ్రేటం నుంచీ రిషబ్ పంత్పై ఫోకస్, చర్చ లేని సిరీస్ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి మ్యాచ్కు ముందు రిషబ్ పంత్కు సలహాలు పోటెత్తుతున్నాయి. ప్రతిభావంతుడైన యువ క్రికెటర్పై విపరీత చర్చ, అతడిని మరింత ఒత్తిడిలోకి నెడుతోంది. హీరోయిక్ ఇన్నింగ్స్లు ఆడేందుకు రిషబ్ పంత్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్చ సాగుతోంది. తాజా సిరీస్ అందుకు భిన్నం కాదు. గత ఎనిమిది ఇన్నింగ్స్ల్లో రిషబ్ పంత్ 30 ప్లస్ పరుగులు చేయలేదు. తొలి టీ20లో పంత్ క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. రాజ్కోట్లోనైనా రాజసమైన ఇన్నింగ్స్ ఆడాలని రిషబ్ పంత్ పట్టుదలగా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్లో శిఖర్ ధావన్ ధనాధన్ అందుకోవాల్సి ఉంది. కెరీర్ వందో టీ20 ఆడుతున్న రోహిత్ శర్మ స్పెషల్ మెరుపులతో అలరిస్తాడేమో చూడాలి. కెఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సంజూ శాంసన్ను ఆడించే అవకాశం లేకపోలేదు. శ్రేయాష్ అయ్యర్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ తమ స్థానాలు నిలబెట్టుకోనున్నారు. సీమర్ ఖలీల్ అహ్మద్ తన స్థానం షార్దుల్ ఠాకూర్కు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.
రెట్టించిన ఉత్సాహంలో బంగ్లా : అండర్డాగ్గా వచ్చిన బంగ్లాదేశ్ నేడు సిరీస్ విజయంపై కన్నేసింది. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా, స్వదేశంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నా.. మైదానంలో బంగ్లాదేశ్ ప్రదర్శన ఆకట్టుకుంది. ముష్ఫీకర్ రహీం, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్లు నమోదు చేశారు. ఛేదనలో చివరి వరకూ పట్టుదల ప్రదర్శించి, మంచి విజయం ఖాతాలో వేసుకున్నారు. భారత్పై తొలి విజయం ఉత్సాహంలో ఉరకలేస్తోన్న బంగ్లాదేశ్ నేడు రాజ్కోట్లోనే సిరీస్ సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తోంది. లిటన్ దాస్, మహ్మద్ నయీంలు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. బంతితో ముస్తాఫిజుర్ రెహమాన్ నాయకత్వం తీసుకోవాలని బంగ్లా ఆశిస్తోంది. యువ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతుండటం బంగ్లాదేశ్కు గొప్ప సానుకూలత.
పిచ్, వాతావరణం : రాజ్కోట్ టీ20కి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. సునామీ మహా గుజరాత్ తీరానికి 660 కిమీల దూరంలో ఉంది. నేడు ఉదయానికి పశ్చిమ తీరాన్ని తాకనుందని వాతవారణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రానికి మహా ప్రభావం కాస్త తగ్గినట్టు ధ్రువీకరించినా, పశ్చిమ తీరంలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. రాజ్కోట్లో గతంలో రెండు టీ20లు జరిగాయి. రెండింట్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ భారత్ గెలుపోటముల రికార్డు 1/1. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సంజూ శాంసన్/ కెఎల్ రాహుల్, శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్, శివం దూబె, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, యుజ్వెంద్ర చాహల్, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకూర్.
బంగ్లాదేశ్ : లిటన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయీం, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, మొసద్దెక్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, ఆమినుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, అరాఫత్ సన్నీ, షఫిల్ ఇస్లాం.
100 రోహిత్ శర్మకు ఇది 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. షోయబ్ మాలిక్ (111) ఒక్కడే మెన్స్ క్రికెట్లో వంద పైచిలుకు మ్యాచుల్లో ఆడాడు. భారత మహిళల జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ టీమ్ ఇండియాకు వంద మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించింది.