Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
బెంగళూర్ : మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి వచ్చేసింది!. ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో ఫిక్సింగ్ కలకలం చెలరేగగా... తాజాగా కర్నాటక ప్రీమియర్ లీగ్ (కెపీఎల్)కు ఫిక్సింగ్ సెగ తగిలింది. కర్నాటక క్రికెట్లో కీలక ఆటగాడు, రంజీ విజయాల్లో కీలక భూమిక వహించిన చిదంబరం మురళీధరన్ గౌతమ్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక ప్రీమియర్ లీగ్లో (కెపీఎల్)లో బెల్లారీ టస్కర్కు సిఎం గౌతమ్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఏడాది కెపీఎల్ ఫైనల్లో మందకోడి బ్యాటింగ్ చేసేందుకు సిఎం గౌతమ్ బుకీల నుంచి రూ. 20 లక్షలు తీసుకున్నట్టు కర్నాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ సంయుక్త కమిషనర్ వెల్లడించారు. సిఎం గౌతమ్తో పాటు అబ్రార్ ఖాజీని సైతం బెంగళూర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుకీలు, ఆటగాళ్ల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన మరో ఆటగాడు నిశాంత్ షెకావత్ను సైతం అరెస్టు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టు అయిన ముగ్గురు క్రికెటర్లపై కర్నాటక క్రికెట్ సంఘం (కెఎస్సీఏ) నిషేధం విధించింది. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని కెఎస్సీఏ కార్యదర్శి సంతోశ్ మీనన్ ప్రకటనలో తెలిపారు.
సిఎం గౌతమ్ అరెస్టుతో కర్నాటక క్రికెట్లో కలకలం రేగింది. 2013-14, 2014-15 కర్నాటక రంజీ విజయాల్లో సిఎం గౌతమ్ కీలక పాత్రధారి. ఐపీఎల్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ఢిల్లీ డెర్డెవిల్స్, ముంబయి ఇండియన్స్ తరఫున గౌతమ్ ప్రాతినిథ్యం వహించాడు. భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రాబిన్ ఉతప్ప, మనీశ్ పాండేలు సిఎం గౌతమ్ సారథ్యంలో కర్నాటకకు ఆడటం గమనార్హం. కెపీఎల్ ఫైనల్స్తో పాటు బెంగళూర్ బ్లాస్టర్స్తో మ్యాచ్నూ సిఎం గౌతమ్ ఫిక్స్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సొంత జట్టును వీడి గౌతమ్ ఈ ఏడాది గోవాకు మారాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో గోవాకు కెప్టెన్సీ వహించాల్సి ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో సిఎం గౌతమ్ గోవా జట్టును వీడాడు.