Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోర్లో భారత్ గులాబీ సాధన
ఇండోర్ : తొలి డే నైట్ టెస్టు కోసం టీమ్ ఇండియా ముందుగానే సిద్ధమవుతోంది. నవంబర్ 24 నుంచి కోల్కత ఈడెన్ గార్డెన్స్లో భారత్, బంగ్లాదేశ్ తమ తొలి డే నైట్ టెస్టు ఆడనున్నాయి. గులాబీ బంతి మ్యాచ్కు ముందు భారత్ రెండు రోజుల ప్రాక్టీస్ సమయం మాత్రమే ఉంది. అందుకే ఇండోర్లో తొలి టెస్టుకు ముందు నుంచే కోహ్లిసేన పింక్ బాల్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్లకు మూడు నెట్స్ను సిద్ధం చేస్తారు. భారత జట్టు అభ్యర్థన మేరకు ఇండోర్లో నల్లని తెరలతో, ఫ్లడ్లైట్ల వెలుతురులో ఓ నెట్స్ను మైదాన సిబ్బంది ఏర్పాటు చేశారు. త్రో డౌన్స్ నిపుణుడు రాఘవేంద్ర పర్యవేక్షణలో తొలుత కెప్టెన్ విరాట్ కోహ్లి గులాబీ బంతి సాధన చేశాడు. పింక్ బాల్పై విరాట్ సౌకర్యవంతంగా కనిపించాడు. గులాబీ బంతి సాధన తర్వాత రెగ్యులర్ ఎస్జీ ఎర్ర బంతితో కోహ్లి సాధన కొనసాగింది. కెప్టెన్ కోహ్లి తర్వాత చతేశ్వర్ పుజార, అజింక్య రహానె, శుభ్మన్ గిల్ గులాబీ బంతిని ఎదుర్కొన్నారు. బెంగళూర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో టెస్టు స్పెషలిస్టులు పుజార, రహానె, శుభ్మన్ల కోసం ద్రవిడ్ పర్యవేక్షణలో పింక్ బాల్ ప్రాక్టీస్ జరిగిన సంగతి తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు ఇండోర్ వేదికగా గురువారం నుంచి ఆరంభం కానుంది